స్విట్జర్లాండ్లోనూ పర్యటించనున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి
లండన్లో ‘ఇండియాస్ యంగ్ అండ్ డైనమిక్లీడర్ కేటీఆర్’ అంటూ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఎన్నారైలు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోనూ పాల్గొననున్న కే తారకరామారావు
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు మంగళవారం నుంచి యూకే, స్విట్జర్లాండ్లో 10 రోజులపాటు పర్యటించనున్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు యూకేలో, 23 నుంచి 27 వరకు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. దావోస్లో ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మంత్రి పాల్గొంటారు.
ఈ నేపథ్యంలో యూకేలోని వెస్ట్ లండన్లోని పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘వెల్కమ్ టు లండన్.. ఇండియాస్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్’ అని టీఆర్ఎస్ ఎన్నారై నేత అనిల్ కూర్మాచలం ఏర్పాటు చేసిన పోస్టర్లు ఆకర్షణగా నిలిచాయి. 12 ఏండ్ల తర్వాత మంత్రి కేటీఆర్ లండన్లో పర్యటిస్తున్నారని, ఆయన రాక కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్నారైలే కాకుండా, పలు రాష్ర్టాలకు చెందిన ఎన్నారైలు ఎదురుచూస్తున్నారని అనిల్ కూర్మాచలం తెలిపారు. ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలను హైదరాబాద్కు రప్పించటంలో కేటీఆర్ చొరవ అసాధారణమైనదని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో, ప్రత్యేకించి ఐటీ విస్తరణలో కేటీఆర్ దేశానికి ఐకాన్గా నిలిచారని పేర్కొన్నారు.