Minister KTR | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పట్టణాల్లో పరిస్థితులపై అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో గురువారం మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, శిథిల భవనాల నుంచి ప్రజలను వెంటనే తరలించాలని సూచించారు. భారీ వర్షాల పరిస్థితులను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, పురపాలక శాఖ అధికారులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని వెల్లడించారు. పురపాలక ఉద్యోగుల సెలవులను రద్దు చేశామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్లు, ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నామని వివరించారు.
హైదరాబాద్కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. నగరంలోని నాలాల్లో పూడిక తీసివేసే కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశామని వెల్లడించారు. 135 చెరువులకు గేట్లు బిగించామని, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ విసృ్తతంగా పనిచేస్తున్నారని చెప్పారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి వరద సమస్య బాగా తగ్గిందని, ఇదంతా నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ఫలితమేనని వివరించారు. వరద పెరిగే ప్రాంతాల్లో పౌరులను అప్రమత్తం చేస్తున్నామని, ఎకడికకడ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి తాతాలిక షెల్టర్లను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వరంగల్కు వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించామని, అవసరమైతే తాను కూడా శుక్రవారం వెళ్తానని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని, భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసేలా చిల్లర విమర్శలు చేయొద్దని హితవు చెప్పారు.
స్వయంగా వరద సహాయక చర్యల పర్యవేక్షణ
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో వరద సహాయక చర్యలను మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హుస్సేన్సాగర్,మూసారంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జిలను పరిశీలించారు.