నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. విద్యార్థులతో లంచ్ చేసిన కేటీఆర్ ఆ తర్వాత వారితో సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలు, వివిధ అంశాల పైన తనకు పూర్తి సమాచారం, అవగాహన ఉందని కేటీఆర్ తెలిపారు. ట్రిపుల్ ఐటీ బాసర అభివృద్ధితో పాటు ఇక్కడి విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ చర్యలు చేపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులతో తన హాస్టల్ అనుభవాలను కేటీఆర్ పంచుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం ఐటీ ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ సహకారంతో, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమన్వయం చేసుకొని ట్రిపుల్ ఐటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ట్రిపుల్ ఐటీలో టీ హబ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, మినీ స్టేడియం, అధునాతన కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు, డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్, విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేయడం, మోడర్న్ క్లాస్ రూముల వంటి అంశాల పైన తాను పూర్తి బాధ్యత తీసుకొని వాటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కేటీఆర్ తెలిపారు. కోర్సులు పూర్తయిన తర్వాత ఇన్నోవేషన్ వంటి రంగాల్లో విజయం సాధించేందుకు విద్యార్థులు ఇప్పటినుంచి సిద్ధం కావాలని కోరారు.