హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో ఐదు విప్లవాల ముంగిట తెలంగాణ ఉందన్నారు. సస్య విప్లవం,వ్యవసాయ విప్లవం, గులాబీ విప్లవం(పశు సంపద అభివృద్ధి),శ్వేత విప్లవం, నీలి విప్లవం గట్టిగా అమలు చేస్తున్నాం అని తెలిపారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
నాలుగు లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశాము. మిగతాది దశల వారీగా చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ రెండు లక్షల రుణాల మాఫీ చేస్తామన్న కూడా ప్రజలు నమ్మకుండా మాకే రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారు. రైతు బీమా రైతుకు రక్షణ కవచంగా మారింది. రైతు బీమాతో కేసీఆర్ రైతులకు అన్నగా మారారు. రైతు బీమాకు రూ. 3205 కోట్ల మేర ప్రీమియం కట్టామని తెలిపారు. 70 వేల మంది రైతులకు రైతు బీమాతో ప్రయోజనం జరిగింది అని స్పష్టం చేశారు.
కేంద్రం నుంచి అరపైసా సాయం లేకున్నా కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని కేటీఆర్ గుర్తు చేశారు. 70 ఏండ్లలో ఇంత త్వరితగతిన ప్రాజెక్టు కట్టిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలకు మమ్మల్ని విమర్శించే ముఖం ఉందా? ఎక్కడైనా ఇంత వేగంగా ప్రాజెక్టు కట్టారా? అని నిలదీశారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులు కేసీఆర్కు రెండు కండ్లు అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయితే కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు ఊపిరి అని అన్నారు. కొందరు దుర్మార్గుల కోర్టు కేసులతో పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం కొంత ఆలస్యంవుతోంది.. అయినా పూర్తి చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ వ్యవసాయానికి దిక్సూచిగా మారారు. నదులకు నడక నేర్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు.