హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గంలో ఒకప్పుడు నెలకొన్న ఫ్లోరోసిస్ పరిస్థితులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పరిస్థితులను చూస్తే కళ్లల్లో నీళ్లు తిరిగాయ్ అని ఆవేదన చెందారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో.. సభలో నాదెండ్ల మనోహర్ నన్ను పిలిచారు. తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆకాంక్షను గౌరవిస్తాను. స్పీకర్గా ఉన్న నేను మీ సహకారంతో పని చేయాలని అనుకుంటున్నాను అని నాదెండ్ల మనోహర్ నాతో చెప్పారు. ఫ్లోరోసిస్పై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. మీరు కూడా నాతో ఉండాలని ఆయన కోరడంతో.. 2010లో మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలానికి వెళ్లాం. ఎమ్మెల్యేలందరం వెళ్తుంటే.. ఆ పరిస్థితులను చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. ఫ్లోరైడ్ నీళ్లు తాగి.. కాళ్లు, చేతులు వంకర అయ్యాయి. మెడలు వంగిపోయిన దృశ్యాలను చూసి చలించిపోయాం. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా 2006, 2007లో ఫ్లోరైడ్ రక్కసిపై పాటలు రాశారు. ఫ్లోరైడ్ రక్కసిని పారదోలేందుకు ఎంతో శ్రమించారు. నల్లగొండ ప్రజల్లారా బాధపడొద్దు.. మీ గోడు తీర్చే బాధ్యత నాది అని కేసీఆర్ ఉద్యమ సమయంలో మాటిచ్చారు. ఇచ్చిన మాట తప్పకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, చౌటుప్పల్లోనే పైలాన్ను ఆవిష్కరించాం. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాం. ఇవాళ ఇంటింటికీ సురక్షితమైన తాగునీరును అందిస్తున్నాం. మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ను నిర్మూలించగలిగామని కేటీఆర్ గుర్తు చేశారు.
నియోజకవర్గ ప్రజలకు శివన్నగూడెం రిజర్వాయర్ ద్వారా ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాకనే జరగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని దండుమల్కాపూర్లో 580 ఎకరాల్లో పదుల సంఖ్యలో పరిశ్రమలు పూర్తయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా తొందర్లోనే ప్రారంభం చేయబోతున్నాం. వేలాది మంది పిల్లలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కేటీఆర్ తెలిపారు.