హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజాజీవితం గురించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కండ్లకోయలో ఐటీ పార్కు శంకుస్థాపన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నప్పుడు.. సింగిల్ విండో ఎన్నికల్లో డైరెక్టర్గా ఎన్నికయ్యారు. చైర్మన్ అయ్యేందుకు మిగతా డైరెక్టర్ల మద్దతు కూడగట్టారు కేసీఆర్. రాఘవపూర్ సొసైటీ వారు చైర్మన్ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడగొట్టారు. ఇది కేసీఆర్కు ప్రజాజీవితంలో మొదటి ఎదురుదెబ్బ. అయినప్పటికీ కేసీఆర్ నిరుత్సాహ పడలేదు. తన ప్రయత్నాన్ని కొనసాగించారు. అలా ఎన్టీ రామరావు తెలుగు దేశం పార్టీలో కేసీఆర్ చేరారు.
రామారావు కేసీఆర్కు 29 ఏండ్ల వయసున్నప్పుడు.. 1983లో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ 750 ఓట్ల తేడాతో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడారు. ఆ ఓటమితో ఒక వేళ కేసీఆర్ నాడే రాజకీయాల నుంచి తప్పుకుని ఉంటే.. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండేదా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవారా? ఆలోచించాలి. ఎదురుదెబ్బలు తగిలినా, అపజయాలు కలిగినా.. మొండిగా ముందుకెళ్తేనే విజయాన్ని ముద్దాడగలం. జీవితంలో అందరికీ ఎదురుదెబ్బలు తగులుతాయి. ఎగ్జామ్ ఫెయిల్ కాగానే ఇదే చివరిరోజు అనుకోవద్దు. టార్గెట్ కోసం శ్రమించాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.