హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులను రాష్ట్రంలో కొందరు అసభ్యకరంగా దూషిస్తున్నా.. ఉద్దేశపూర్వకంగా ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తున్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. భావప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కన్నడ నటుడు చేతన్ అభ్యంతకరమైన ట్వీట్ చేశాడంటూ కేసు నమోదు చేసి అక్కడి ప్రభుత్వం 14 రోజుల రిమాండ్కు పంపిన సంగతిని గుర్తు చేశారు.
మరో రెండు జుమ్లాలు
దేశంలో మరో రెండు రకాల జుమ్లాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ అన్నారు. కో ఆపరేటివ్ ఫెడరలిజం, టీం ఇండియా స్ఫూర్తి ఇవి రెండు జుమ్లాలు అంటూ ఉటంకించారు. వీటి గురించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదని, అయితే అవి రెండు జుమ్లాలు అంటూ ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో జరిగిన ఘటనను ఉదహరించారు. ‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో ప్రజల మనసులను గెలుచుకోలేనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించి, వారి పార్టీని చీల్చటానికి ప్రయత్నించి, ఇవన్నీ విఫలమైనప్పుడు మీ అనుచరులు, సహచరుల ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని అడ్డుకుంటా’రంటూ బీజేపీపై కేటీఆర్ ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. బుధవారం ఢిల్లీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ సభ్యులు చేసిన అవాంతరాల గురించి ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఉగాది శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు ఉగాది శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది, గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలుకుతూ, ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
దేశీయ ఉగాది పంచాంగమంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్
దేశీయ ఉగాది పంచాంగమంటూ సరికొత్తగా, వినూత్నంగా చెప్పారు మంత్రి కేటీఆర్. ఉగాది పంచాంగమంటే ప్రజలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో అదానీ, ప్రధాని మోదీ సంబంధాలపై మరోసారి వ్యంగ్యంగా ట్విట్టర్లో స్పందించారు. తనకు ఒకరు పంపించినదాన్ని ట్వీట్ చేశానంటూ పేర్కొన్నారు.
“ఆదాయం : అదానీకి
వ్యయం : జనానికి, బ్యాంకులకు..
అవమానం : నెహ్రూకి
రాజపూజ్యం : గుజరాతీ గుంపునకు..
బస్, బభ్రాజమానం భజగోవిందం
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం”