Minister KTR | వరంగల్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఈడీ, ఐటీ సంస్థలతో వేటకుక్కల్లా దాడులు చేయిస్తున్నారని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు గర్జించారు. ప్రధానమంత్రి తన కింద ఉన్న సీబీఐ, ఐటీ లాంటి సంస్థలను వేటకుక్కల్లాగా ఉసిగొల్పి కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం లాంటి దిక్కుమాలిన పనులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులకు భయపడేది లేదని, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఇదే వరంగల్లో జైలుకు వెళ్లివచ్చినోళ్లమని.. ఎంతదాకనైనా పోరాడుతామని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి హనుమకొండ జిల్లా వేలేరు మండలం శోడషపల్లిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. దేవాదుల ప్రాజెక్టుతో ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.104 కోట్లతో కొత్తగా చేపట్టిన మూడు లిఫ్ట్ పనులతోపాటు మరో రూ.23 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన శోడషపల్లిలో నిర్వహించిన ‘రైతు కృతజ్ఞత సభ’లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు పట్టిన శని, దరిద్రం ముమ్మాటికి బీజేపీ అని విమర్శించారు. బీజేపీ నాయకులు చిల్లర మాటలు, చిచోరా పనులు చేసుకుంటూ… మతం, కులం పేరుతో రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.
‘రైతుల ఆదాయం డబుల్ చేస్తనని 2014లో మోదీ గొప్పలు చెప్పిండు. ఒక్క రైతు ఆదాయం అయినా డబుల్ కాలేదు, ఒకే ఒక్కడి ఆదాయం 1,300 రెట్లు పెరిగింది. మన పైసలు అదానీ వద్దకు వెళ్లాయి. నల్లధనం గుంజు కొస్తనని చెప్పిండు. నల్లధనం ఏమైందని అడిగితే తెల్లమొఖం వేసుకుని తప్పించుకోని తిరుగుతుండు. జన్ధన్ ఖాతాలు తెరువండి.. ధనాధన్ 15 లక్షలు ఖాతాలో జమ చేస్తా అన్నారు. ఒక్కడి ఖాతాలోనైనా జమ చేశారా? అన్నీ ఒకే ఒక్కడి ఖాతాలోకి వెళ్లాయి. బుల్లెట్ రైళ్లు ఉరుకుతయ్ అన్నడు. ప్యాసింజర్ రైళ్లు కూడా ఉరుకుతలేవు. తెలంగాణలో కొత్తగా వంద కిలోమీటర్ల రైల్వేలైన్ అయినా వేయలేదు. ప్రధాని మోదీ దేశంలో అరాచక పాలన చేస్తున్నడు. ఒకే ఒక్కడిని కుబేరుడిని చేయడమే పనిగా పెట్టుకున్నడు’ అని మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. దోస్తుకు మూటలు మోసి, అందులోంచి పార్టీ చందాలు తీసుకుని, ఎమ్మెల్యేలను కొని, ప్రభుత్వాలను కూల్చడం, పార్టీలను చీల్చడమే మోదీ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు ఢిల్లీలో నోటికొచ్చినట్టు ఫేకుడు.. ఇక్కడ జోకుడు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కరోనా వ్యాక్సిన్ను మోదీయే కనిపెట్టాడని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయనకు మెదడు మోకాళ్లలో ఉన్నదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నాడని, ఈయన ఎంపీ అయింది ఇందుకేనా? అని నిలదీశారు. మోదీ ఎవనికి దేవుడో, ఎందుకు దేవుడో చెప్పాలని ప్రశ్నించారు. ‘రూ.400 ఉండే గ్యాస్ సిలెండర్ను రూ.1,200 చేసినందుకు దేవుడా? రూ.70 ఉన్న పెట్రోల్ను రూ.112 చేసినందుకు దేవుడా? నల్లా చట్టాలు చేసి 700 మంది రైతులను చంపినందుకు దేవుడా? తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వనందుకు దేవుడా? ఖాజీపేటలో కోచ్ఫ్యాక్టరీ, ములుగులో ట్రైబల్ యూనివర్సీటీ ఇవ్వనందుకు దేవుడా?’ అని ప్రశ్నించారు. మోదీ అదానీకే దేవుడు కావచ్చునంటూ గాలితీశారు. ‘మోదీ వ్యవహారాన్ని దేశం చూస్తున్నది. అదానీకి పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని మోదీ ఒత్తిడి తెచ్చారని శ్రీలంక అధ్యక్షుడు చెప్పారు. నీతివంతుడి లెక్క ఫోజులు కొడుతున్నవు కదా? దమ్ముంటే దేశం ముందుకు రా.. విచారణ జరిపించు.. నిజా నిజాలు తేల్చు’ అని సవాల్ చేశారు. బీజేపీ నేతలు మతం పేరిట మంటలు, కులం పేరిట కుంపట్లు రాజేస్తున్నారని, ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మన కోసం, ప్రజల కోసం సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ను కాపాడుకోవాలని విజ్ఞప్తిచేశారు.
బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి కేటీఆర్..
రాజకీయ నిరుద్యోగులు, దివాళాకోరు రాజకీయ నాయకులు తాకట్లు పెట్టడానికి, ప్రజలను రెచ్చగొడుతూ పలికి మాలిన పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. పీసీసీ అధ్యక్షుడు మాట్లాడేందుకు ఏమీలేక చందమామలో మచ్చలను వెదికిన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్ నేతలు 50 ఏండ్లు అధికారం ఇస్తే ఏమి చేశారని నిలదీశారు. ఉచిత కరెంట్, రైతుబీమా, రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్కు ఏనాడైనా వచ్చిందా?’ అని ప్రశ్నించారు. ఒక్క చాన్స్ ఇవ్వండని అడుగుతున్న రేవంత్రెడ్డి తీరు హంతకుడే సంతాపం చెప్పినట్టుగా ఉన్నదని చురకలేశారు.
‘నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణ ఉద్యమం నడిచింది. మన రాష్ట్రంలో మన నిధులు మనకు వస్తున్నాయి. ఇయ్యాల ఒక్కరోజే రూ.127 కోట్ల నిధులతో పనులు మొదలుపెట్టుకున్నం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రోజైనా ఇలా జరిగిందా? కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారు. దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు అందుతున్నది. ప్రభుత్వ శాఖల్లో 2.21 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకుంటున్నం. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ వ్యవసాయం పంజాబ్, హర్యానాతో పోటీగా దూసుకుపోతున్నది. తెలంగాణ రైతులు దేశంతో పోటీ పడుతున్నరు. ఇది ఎలా సాధ్యం అయ్యింది? సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్ట్లను పూర్తి చేసి, చెరువులను బాగుచేసి, ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా ఇస్తే సాధ్యమైంది. మన రైతులు పుట్లకు పుట్లు పండించి దేశంతో పోటీ పడుతున్నారు’ అని కేటీఆర్ వివరించారు.
దేవాదుల ఎత్తిపోతల, రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే టీ రాజయ్య
అభివృద్ధి, సంక్షేమంలో ముందుకుసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక ప్రతిపక్ష పార్టీలు కుటుంబపాలన అంటూ విమర్శిస్తున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘బరాబర్ మాది కుటుంబపాలనే. 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబసభ్యులే. 4 కోట్ల మంది బిడ్డలకు కుటుంబ పెద్ద కేసీఆర్’ అంటూ తన దైన శైలిలో జవాబిచ్చారు. రైతుబంధుతో రైతులకు పెద్దన్నలాగా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో ఆడబిడ్డలకు మేనమామలాగా, కేసీఆర్ కిట్తో పసిపిల్లలకు తాతలాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, 4 కోట్ల మందితో వసుధైక కుటుంబ పాలన సాగిస్తున్నారని వివరించారు. ‘మనకు కులం పంచాయితీ లేదు. మత పిచ్చి లేదు. జనహితమే మన అభిమతం. అభివృద్ధే కులం. సంక్షేమమే మన మతం’ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు తెలంగాణ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఉత్తమ అవార్డులు ఇస్తున్నదని, మరోవైపు బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఉదహరించారు.
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చుతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. స్టేషన్ఘన్పూర్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటుతోపాటు, ధర్మసాగర్, వేలేరు, తరిగొప్పుల, నర్మెట, జనగామ రోడ్డును డబుల్లైన్గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర ప్రభుత్వ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్, ఒడితల సతీశ్కుమార్, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి విషయంలో దోషులను వదిలిపెట్టేది లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ‘అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే.. సైఫ్ అయినా, సంజయ్ అయినా ఎవ్వడైనా సరే వదిలిపెట్టం. చట్టపరంగా, న్యాయపరంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటం’ అని స్పష్టం చేశారు. డాక్టర్ ప్రీతి కుటుంబానికి ప్రభుత్వ పరంగా, పార్టీపరంగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ప్రీతి మృతిని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పుడు ఒక్క చాన్స్ ప్లీజ్ అంటున్నోళ్లను చూస్తే నాకో కథ గుర్తుకు వస్తున్నది. ఒకడు చిన్నప్పుడే చెడిపోయిండు. బడికి పోక తాగుడు నేర్చిండు. తాగుడు, గుట్కా, జర్ద అంత గలీజుగా మారిండు. పెద్దగ అయినంక ఒక రోజు తాగుడు కోసం వాళ్ల నాయన జేబుల నుంచి పైసలు దొంగతనం చేసిండు. వాళ్ల అమ్మ కొట్టింది. తాగిన మత్తుల వాడు రోకలి బండతోని కొట్టి తల్లిని సంపిండు. అప్పుడే వచ్చిన తండ్రిని చంపిండు. పోలీసులు పట్టుకపోయి కేసు పెట్టిండ్రు. కోర్టుల విచారణ అయితాంది. పెద్ద శిక్ష పడుతదనుకుని వాడు ముందుగానే ఆలోచన చేసిండు. అయ్యవ్వ లేనోన్ని జాలి చూపించాలె.. అని బతిలాడుకున్నడు. ఇప్పుడు ఒక్క చాన్స్ ప్లీజ్ అని అడుక్కొనే పార్టీ అధ్యక్షుల తీరు అట్లనే ఉన్నది’ అంటూ కేటీఆర్ తన దైన శైలిలో వివరించారు.
దేవాదుల ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికీ సాగునీరు అందని ఎగువ ప్రాంతాలను పచ్చగా మార్చే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ సోమవారం మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.104 కోట్లతో చేపట్టే ఈ పనులతో 30 గ్రామాల్లోని 6,790 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందనున్నది.
శోడషపల్లి రైతు కృతజ్ఞత భారీ బహిరంగ సభ విజయవంతమైంది. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు, మహిళలు, యువకులు భారీగా తరలివచ్చారు. కరువు ప్రాంతాలకు నీరు ఇ చ్చే దేవాదుల ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల శంకుస్థాపన కావడంతో రైతాంగం హర్షం వ్యక్తంచేసింది. దీంతో లబ్ధిపొందుతున్న గ్రామాల్లోని కుటుంబాలకు కుటుంబాలు సభకు తరలివచ్చాయి. మంత్రి కేటీఆర్ పర్యటనతో ఎమ్మెల్సీ పల్లా స్వగ్రామం శోడషపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. ఊరు చుట్టూ ఉన్న రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మోటరు సైకిళ్లు, ఆటోలు, ట్రాక్టర్లలో జనం భారీగా తరలివచ్చి మేళతాళాలు, భాజాభజంత్రీలతో మంత్రి కేటీఆర్కు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ ప్రసంగం కొనసాగినంత సేపు సభా ప్రాంగణంలో మహిళలు, యువకులు కేరింతలు కొట్టడం కనిపించింది. రైతు కృతజ్ఞత సభ నిర్వహణకు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అంతా తానై వ్యవహరించారు.
రైతులకు ఎదురు పెట్టుబడి పెడుతు న్న మహానుభావుడు సీఎం కేసీఆర్. కరువుతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాం తానికి నీళ్లు ఇవ్వడానికి 3 లిఫ్ట్లను 127 కోట్లుతో శంకుస్థాపన చేసుకున్నం. వీటి ద్వారా మూడు లిఫ్టులతో 30 గ్రామాల్లోని 53 చెరువులను నింపడం ద్వారా 6,794 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కలిసికట్టుగా పని చేస్తున్నారు.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పేదవాడి కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కేసీఆర్ పాలన స్వర్ణయుగం. మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దే. రాష్ట్రంలో గిరిజనులను ఓటు అడిగే హక్కు బీజేపీ, కాంగ్రెస్లకు లేదు.
– మంత్రి సత్యవతి రాథోడ్
దేవాదుల ప్రాజెక్టుతో స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నాయి. 127 కోట్లతో మూడు లిఫ్ట్లకు శంకుస్థాపన చేసుకున్నం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ధర్మసాగర్, వేలేరు, చిల్పూర్ మండలంలోని గ్రామాలకు 90% సాగునీరు అందుతుం ది. వేలేరు మండలం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ను కోరిన వెంటనే ఆ మోదం తెలిపారు. ఈ ప్రాంతంపై సీఎం కేఆసీర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
– పల్లా రాజేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు
రాబోయే రోజుల్లో కాబోయే సీఎం కేటీఆర్. నిండు మనసుతో ఈ ప్రాం తంపై ప్రేమ ఉంచాలి. ఈ నియోజకవ ర్గం నాకు రాజకీయ జన్మనిచ్చింది. దీని అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తా. 2001లో దేవాదుల ఎత్తిపోతల కోసం 1,400 ఖర్చు చేసి పనులు చేపట్టినా ఇంకా పూర్తిస్థాయిలో పూర్తి కాలేదు. మరో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే రెండు, మూడో దశ పనులు పూర్తవుతాయి.
– ఎమ్మెల్సీ కడియం శ్రీహరి