హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): నాడు నెత్తురు పారిన నేలలో నేడు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి మల్లన్నసాగర్ నింపి.. కూడవెల్లి వాగుద్వారా మన బీళ్లకు నీళ్లు మళ్లిస్తున్నట్టు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కలలో కూడా ఊహించని సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి మీ కండ్ల ముందు కనిపిస్తున్నదని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఏప్రిల్ నెలలో ఎర్రటి ఎండల్లోనూ అప్పర్ మానేరు మత్తడి దుంకుతున్నదంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని పేర్కొన్నారు.
నెర్రెలు బారిన ఈ నేలలో ఏడెనిమిది దశాబ్దాల్లో ఈ రోజు మొట్ట మొదటిసారి నీళ్లను చూస్తున్నామని, కన్నీళ్లు కారిన ఈ నేలలలో సాగునీరు ఒకవైపు, తాగునీరు ఒకవైపు పుష్కలంగా వస్తున్నాయని తెలిపారు. ‘సిరిశాలగా పేరుగాంచిన సిరిసిల్ల సమైక్య పాలనలో నేతన్నల ఆత్మహత్యలతో ఉరిశాలగా మారింది. ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో.. ఆనాడే సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారినయ్. బతుకులు మారినయ్. ఇది నేతల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం’ అని పేర్కొన్నారు. సిరిసిల్ల ఇవాళ కలలో ఊహించని విధంగా జిల్లా అయిందని, ఎక్కడో కరీంనగర్లో ఉండే కలెక్టర్ను, అధికారులను కలిసేందుకు 80 కిలోమీటర్లు పొయ్యే బాధ తప్పిందని అన్నారు. ఈ రోజు మన సిరిసిల్లలోనే కలెక్టర్ను, ఎస్పీ, జిల్లా అధికారులను కలిసే అవకాశం ఏర్పడిందని చెప్పారు.
విద్య, వైద్యానికి కొదువ లేదు
జూనియర్, డిగ్రీ కాలేజీలు కావాలని ధర్నాలు చేసే గడ్డకు ఇవాళ ఏకంగా మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని కేటీఆర్ తెలిపారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలే జీ, లెక్కకు మిక్కిలి విద్యా సంస్థలు, రాష్ట్రంలోనే మొట్టమొదటి కేజీ టు పీజీ క్యాంపస్ను మన గంభీరావుపేటకు ఇచ్చింది కేసీఆరే అని గుర్తు చేశారు. సిరిసిల్ల జిల్లాలో విద్య, వైద్యానికి కొదువలేదని, అభివృద్ధి, సంక్షేమం వెల్లివిరిస్తున్నదని చెప్పారు. తం గళ్లపల్లి బ్రిడ్జి కింద వాగులో 365 రోజులు మన కండ్ల ముందు బ్రహ్మాండంగా నీళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. భూగర్భ జలా లు ఆరున్నర మీటర్లు పైకి వచ్చి ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే లాల్బహదూర్శాస్త్రి అకాడమీలో ఇవాళ చర్చ జరుగుతున్నదంటే అది కేసీఆర్ ఘనతేనని చెప్పారు.
‘సర్ మిమ్మల్ని ఎక్కువగా అడిగేదేమి లేదు. అడుగకుండానే అన్ని ఇచ్చిన్రు. రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డల ఆదరాభిమానాలతో, మా అన్నదమ్ముళ్ల ఆశీర్వాదాలతో తప్పకుండా గులాబీజెండా ఎగురవేస్తాం. కారుగుర్తుకే ఓటేసి అద్భుతమైన మెజార్టీతో మీ నాయకత్వానికి జైకొట్టి, మిమ్మల్ని మూడోసారి సీఎంగా చేస్తాం. మేం కోరుకునేదల్లా ఒక్కటే. గత పదేండ్లు సీఎంగా మీ ప్రేమ, ఆశీర్వాదం మాకు దొరికింది.. భవిష్యత్తులోనూ అదే ప్రేమ, ఆశీర్వాదం మాకుండాలని ఈ ప్రాంత నేతన్నల తరఫున, గీతన్నల తరఫున, రైతన్నల తరఫున, ఆడబిడ్డల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని కేసీఆర్ను కోరారు.