ప్రధాని మోదీ రూపాయి విలువను ఆకాశంలోకి తీసుకెళ్లి ప్రజలను ఆగం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిందేమీ లేదు. అలాంటి పార్టీకి ఎన్నికల్లో గుండు సున్నా ఇద్దాం.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పేద ప్రజల అభివృద్ధి గీటురాయిగా పనిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. పది సంవత్స రాలుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరాభివృద్ధికి పాటుపడ్డామని తెలిపారు. గురువారం మంత్రి కేటీఆర్ కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభ, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మెరుగైన శాంతి భద్రతలు, నిరంతర విద్యుత్తు సర ఫరా, సమృద్ధిగా తాగునీరు, రవాణా, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకొని హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నట్టు వెల్లడించారు. సుభిక్షంగా ఉన్న హైదరాబాద్లో ఈగ వాలినా అందరం నష్టపోతామని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరా రు. 22 ఏండ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చిన తమిళనాడు నటుడు సూపర్స్టార్ రజనీకాంత్ హైదరాబాద్లో ఉన్నామా? న్యూయార్క్లో ఉన్నామా? అని ఆశ్చర్యపోయారని చెప్పారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్ అభివృద్ధిపై ప్రశంసలు అందుతుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం గుర్తించలేకపోతున్నాయని మండిపడ్డారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి మరోసారి ప్రజల ఆశీర్వాదం కోరుతున్నామని అన్నారు.
పదేండ్ల క్రితం ఏమైతదో అన్న అనుమానాల నుంచి తలసరి ఆదాయంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడకముందు రూ.1.12 లక్షల తలసరి ఆదాయం ఉంటే నేడు రూ.3.17 లక్షలతో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని వివరించారు. ఐటీ వృద్ధి రేటులో బెంగళూరును దాటామని, 3.20 లక్షల ఉద్యోగాల నుంచి 10 లక్షల మంది ఉద్యోగాల కల్పనకు ఎదిగామని వెల్లడించారు. వ్యాక్సిన్సలో భారతదేశం ఉత్పత్తిలో 40 శాతం హైదరాబాద్ నుంచే అవుతుండటం గర్వకారణమని అన్నారు. త్వరలోనే రూ.5 వేల కోట్లతో ఎస్ఎన్డీపీ రెండో దశ పనులు చేపడతామని తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం, అమరువీరుల స్మారకం, 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఇలా హైదరాబాద్కు వన్నె తీసుకువచ్చే నిర్మాణాలు చేపట్టినట్టు వివరించారు. తొమ్మిదిన్నరేండ్లలో హైదరాబాద్లో నిరంతర విద్యుత్తు, సమృద్ధిగా నీరు, ఫ్లైఓవర్లు,అండర్పాస్లు, ఎఫ్వోబీలు, పార్కులు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, 2052 వరకు మంచినీటికి తిప్పలు లేకుండా చేశామని తెలిపారు. దీనితోనే సంతృప్తి చెందటం లేదని, ప్రతి రోజు 24 గంటల నీరు అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ కే నవీన్కుమార్, కార్పొరేటర్లు శ్రీనివాస్రావు, నర్సింహాయాదవ్, సబిహా, శిరీషాబాబురావు, సత్యనారాయణ, మహేశ్వరి, పండాల సతీశ్, ఆవుల రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ను ఓడించాలి అంటున్న ఈ ప్రతిపక్ష పార్టీలకు బుద్ది చెప్పాలి. హైదరాబాద్కు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చినందుకు ఓడించాలా? 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చినందుకా? సర్కార్ దవాఖానకు రాను బిడ్డో అన్న పరిస్థితుల నుంచి సర్కారీ దవాఖానలోనే ప్రసూతి కావాలనే స్థితికి తీసుకువచ్చినందుకా?
– మంత్రి కేటీఆర్