కరీంనగర్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. దుక్కి దున్నటం మొదలు.. పంట అమ్ముకొనే వరకు రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల రైతులతో కేటీఆర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని లక్షన్నర మంది రైతులతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాట్లాడారు.
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. 24న జరిగే సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్) ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని నమ్మే సీఎం కేసీఆర్, దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించేందుకు కూడా సాహసించని రీతిలో రైతుబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు.
నాడు దండగ అంటే.. నేడు పండుగ చేశాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి పాలకులు వ్యవసాయాన్ని దండగ అని నిర్లక్ష్యం చేస్తే.. తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతుల పరిస్థితి ఎట్లుండె? ఈ రోజు ఎట్లున్నది? ఒకసారి ఆలోచించండి. 2014కు ముందు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎవరైనా చనిపోతే బంధువులు స్నానం చేయడానికి 5 నిమిషాలు కరెంటు ఇవ్వండి అని సెస్ వాళ్లను బతిమిలాడుకొనే పరిస్థితి ఉండె. నాడు వ్యవసాయం ఒక శిక్షగా ఉండేది. నీళ్లు లేవు. ఎప్పుడో పేరుకు మిడ్ మానేరు కడుతున్నామని చెప్పుడే తప్ప పని చేసింది లేదు. అన్నింటికి మించి గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలన్న కల, తీరని కలగానే మిగిలిపోతుందేమో అన్న పరిస్థితి ఉండె. కరెంటుకు ఇబ్బందే. నీళ్లకూ ఇబ్బందే. అలాంటి పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగ చేశారు’అని తెలిపారు.
25 వేల కోట్లతో ఉచిత విద్యుత్తు, రైతుబంధు
ఉచిత విద్యుత్తు, రైతుబంధు కోసమే ప్రభుత్వం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొన్న మొదటి ఆరు నెలల్లోనే విద్యుత్తు సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. నాడు రోజుకు ఆరుగంటలు కూడా సరిగ్గా రాని కరెంటు, నేడు 24 గంటలూ ఉంటున్నది. మరే రాష్ట్రంలో లేనివిధంగా రైతన్నల కోసం 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఉచిత విద్యుత్తు కోసం ఏటా ప్రభుత్వం పెడుతున్న ఖర్చు రూ.10 వేల కోట్లు. ఉచిత విద్యుత్తుకు సబ్సిడీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ సీఎం, పీఎం చేయని ఆలోచన సీఎం కేసీఆర్ చేశారు. ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నది.
రైతుబంధు ద్వారా ఇప్పటి వరకు 9 విడతల్లో రూ.57,882 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. 10వ విడత వేస్తున్న నిధులు రూ.7,600 కోట్లను కలుపుకుంటే మొత్తం రూ.65 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. రైతుబంధుతో రాష్ట్రంలో సుమారు 66 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతున్నది. కేంద్రంతోపాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రైతుబంధును స్ఫూర్తిగా తీసుకొని పథకాలు తెచ్చాయి. ఇంత పెద్ద పనిని గతంలో ఉన్నవారు ఎందుకు చేయలేదు? ఉచిత విద్యుత్తుకు ఏటా రూ.10 వేల కోట్లు, రైతుబంధు కోసం ఏటా రూ.15 వేల కోట్లు కలిపి రూ.25 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది’ అని వివరించారు.
సాగు ముఖచిత్రాన్నే మార్చేశాం
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘అన్నదాతలను సంఘటితం చేసి చైతన్యపరచడానికి ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటుచేసి, ఒక్కో క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించాం. ఇలా రూ.572 కోట్లతో 2,601 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. పైసా కట్టే అవసరం లేకుండా ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నాం. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 94 వేల మంది రైతుల కుటుంబాలకు రూ.4,700 కోట్ల బీమా పరిహారం చెల్లించాం’ అని పేర్కొన్నారు.
కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
దేశంలో వ్యవసాయం అభివృద్ధికి సీఎం కేసీఆర్ పర్యాయపదంగా మారారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం ధాన్యం కొనలేక చేతులెత్తేసేంతగా తెలంగాణలో సాగు విస్తరించిందని పేర్కొన్నారు. ‘ కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అన్నట్టుగా సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్ మార్పులు తెచ్చారు. రిజర్వాయర్లు, చెరువులు, కాలువల నిర్మాణంతో భూగర్భ జలాలు అమాంతం పైకి వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు 20 ఫీట్లు పైకి వచ్చి బోర్లన్నీ రీచార్జి అయిన మాట వాస్తవమా? కాదా? కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయరంగం ఎంత విస్తరించిందంటే.. మనం పండించిన వడ్లు కేంద్రం ‘మేం కొనలేం’ అని చేతులెత్తేసింది. 2014లో ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు 68 లక్షల టన్నులైతే, మొన్న యాసంగిలో కొనుగోలు చేసింది మూడున్నర కోట్ల టన్నులు. ఎక్కడ 68 లక్షల టన్నులు? ఎక్కడ మూడున్నర కోట్ల టన్నులు? వ్యవసాయం ఎంత విస్తరించిందో దీన్ని బట్ట్టే అర్థం చేసుకోవచ్చు. ధాన్యం నిల్వకు 2014లో 4 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను, నేడు 26 లక్షల టన్నులకు పెంచుకొన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ పరిధిలో గతంలో 44 సబ్ స్టేషన్లు ఉండేవి. తెలంగాణ రాగానే మరో 39 ప్రారంభించాం. అంటే మనకంటే ముందు 52 ఏండ్లలో 44 సబ్స్టేషన్లు కడితే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో దాదాపు రెట్టింపు చేసుకొన్నాం’ అని వివరించారు.
కేటీఆర్ జిమ్ ఫొటో వైరల్
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్, శుక్రవారం సోషల్మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్గా మారింది. జిమ్లో వర్కవుట్ చేస్తున్న ఫొటోను కేటీఆర్ షేర్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు లైక్ చేశారు.
వారాల ఆనంద్కు అభినందనలు
అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురసారం పొందిన తెలంగాణ బిడ్డ వారాల ఆనంద్కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రముఖ భావకవి గుల్జార్ 58 కవితలను ఆకుపచ్చ కవితలు పేరిట తెలుగులోకి అనువదించిన ఆనంద్కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురసారం దక్కిన విషయం తెలిసిందే. గుల్జార్ సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందించడం గొప్ప విషయమని అన్నారు.