Minister KTR | పొరపాటున రేపు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమ్ముతాడని.. అది పక్కా అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పాలకుర్తి నుంచి తిరుపతిరెడ్డి, గద్వాల్ నుంచి కురువ విజయ్కుమార్, ముథోల్కు చెందిన కిరణ్ వాగ్మోరేతో పాటు జనగామకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రేవంత్రెడ్డి వచ్చాక ఎలా ఉందో చూడవచ్చన్నారు.
నోటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి పీసీసీ చీఫ్ అయ్యాడని.. ఇవాళ సీటుకు రేటు రేవంత్ తీరు.. పొరపాటున రేపు సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్మడం పక్కా అన్నారు. నాడు మహబూబ్నగర్ మైగ్రేషన్ అని.. ప్రస్తుతం మహబూబ్నగర్ అంటే ఇరిగేషన్ అన్నారు. 14.50లక్షల ఎకరాలకు పాలమూరులో నీరందుతుందన్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చారని.. 15 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, అమిత్షా, మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు అంతా తెలంగాణకు క్యూకట్టారన్నారు. కేసీఆర్ను కొట్టడానికి ఇంత మంది తెలంగాణకు రావాల్నా..? సీఎం కేసీఆర్ సింహంలా సింగిల్గా వస్తారన్నారు.