హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ ): ఐదేండ్లు వానల్లేకున్నా హైదరాబాద్ నగర తాగునీటికి ఎలాంటి ఇబ్బందీ లేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీకి చేరినా.. హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండబోదని అన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణా వాటర్ సప్లయ్ స్కీంలో భాగంగా రూ.1450 కోట్ల వ్యయంతో చేపడుతున్న సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టుకు శనివారం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
సుంకిశాల వద్ద జరుగుతున్న సర్జ్ఫూల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో వందేండ్ల ముందుచూపు ఉన్న నాయకుడు కేసీఆర్ అని, సీఎం దార్శనికత వల్లే తెలంగాణ అన్నిరంగాల్లో విజయయాత్ర సాగిస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, ఆలోచనా విధానం, సంకల్పం వల్ల హైదరాబాద్ నగరం భారతదేశంలోనే అగ్రశ్రేణి నగరంగా ఎదుగుతున్నదని, ఏడున్నర ఏండ్లలో ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయని ఆయన తెలిపారు. తెలంగాణకు రాజధాని హైదరాబాద్ అయినప్పటికీ..భారతదేశానికి ఒక అసెట్ అని పేర్కొన్నారు.
భవిష్యత్తు భారతావనికి ఒక దిక్సూచిలా ఉండేలా హైదరాబాద్లో కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని కేటీఆర్ వెల్లడించారు.శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్.. రాబోయే 15ఏండ్లలో ఢిల్లీ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా ఆవిర్భవిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఎయిర్ట్రాఫిక్లో చెన్నై, కోల్కతాను దాటుకుని హైదరాబాద్ నాలుగోస్థానానికి చేరుకొన్నదని చెప్పారు. భౌగోళిక, పర్యావరణ అనుకూలతలు హైదరాబాద్కు ప్రత్యేకమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం నాలుగేండ్లలో పూర్తిచేసినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా పూర్తిచేసిన ప్రాజెక్టు కాళేశ్వరమేనని, ఈ ఘనత కేవలం తెలంగాణకు, సీఎం కేసీఆర్కు దక్కుతుందని కేటీఆర్ చెప్పారు.