హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. ఫార్మా సిటీలో భూముల కొనుగోలు, విక్రయాలపై తప్పుడు ఆరోపణలు చేసిన శ్రీధర్ బాబుపై కేటీఆర్ మండిపడ్డారు. ఐ స్టాండ్ కరెక్టెడ్ ఇఫ్ ఐయామ్ నాట్ రైట్ అని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఫార్మా సిటీలో భూములను రూ. 8 లక్షలకు కొని.. రూ. కోటి 30 లక్షలకు అమ్ముతున్నారని శ్రీధర్ బాబు అడ్డగోలుగా ఆరోపణలు చేసి ఐ స్టాండ్ కరెక్టెడ్ అని అందంగా ఇంగ్లీష్లో చెప్తే ఎలా? అని కేటీఆర్ అడిగారు. చేసింది తప్పుడు ఆరోపణ.. ఉపసంహరించుకునేందుకు భేషజాలు ఎందుకు..? అని ప్రశ్నించారు.
శ్రీధర్ బాబు చేసిన ఆరోపణలపై కేటీఆర్ మాట్లాడుతూ.. శ్రీధర్ బాబు మంచి విద్యాధికుడు. రాజకీయాల్లో విమర్శ కోసమే విమర్శ.. అసత్యాన్ని కూడా అందంగా, వినసొంపుగా చెప్తే అది సత్యమై పోతదన్నట్టు వారు మాట్లాడేస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఫార్మా సిటీలో భూములను ఎకరాకు రూ. 8 లక్షల చొప్పున కొనుగోలు చేశారని, రూ. ఒక కోటి 30 లక్షలకు విక్రయించినట్లు శ్రీధర్ బాబు మాట్లాడారు. ఒక్క ఎకరం కాదు ఒక్క సెంటు కేటాయించినట్లు నిరూపించగలరా..? అని శ్రీధర్ బాబుకు కేటీఆర్ సవాల్ విసిరారు. నిరూపించకపోతే క్షమాపణ చెబుతారా? అని అడిగారు. రాజకీయ వేదికల మీద మాట్లాడిన విధంగానే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
ఆర్టీఐ పేరిట అడ్డగోలుగా బ్లాక్ మెయిల్ దందాలు చేస్తాం. ఆర్టీఐని రూట్ టు ఇన్కమ్గా మార్చుకుంటాం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా భూములపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వద్ద ఒక దఫ్తర్ నడుస్తుంది. ఓ ప్రత్యేక కార్యాలయంలో రిటైర్డ్ తహసిల్దార్లతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకుని ప్రభుత్వాన్ని, ప్రయివేటు వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయాలు వసూళ్లు చేసే వారికి ధరణి వల్ల ఇబ్బంది ఉంటుంది. అది శ్రీధర్ బాబుకు ఉండకూడదు. ఫార్మా సిటీలో ఇప్పటి వరకు ఎకరం కాదు.. అర ఎకరం కాదు.. గజం కూడా కేటాయించలేదు. తెలువకపోతే తెలుసుకోవాలని శ్రీధర్ బాబుకు కేటీఆర్ సూచించారు. సభను తప్పుదోవ పట్టించే విధంగా సత్య దూరమైన మాటలు మాట్లాడుతూ, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదు. ఫార్మాసిటీలో ఒక గజం భూమి అమ్మినట్లు రుజువు చేయగలుగుతారా? అని సవాల్ విసిరారు. రాజకీయంగా లబ్ది పొందాలని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.