Minister KTR | నష్టాలను జాతికి అంకితం ఇచ్చి.. లాభాలను ప్రైవేటు దోస్తులపరం చేయడమే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంలా కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ పలుమార్లు ఆధారాలతో బయటపెట్టారని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని మొదట్నుంచి సీఎం కేసీఆర్ చెబుతూనే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని వివరించారు.
‘ ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు కాపాడుకోవాలి? వాటిని కాపాడుకుంటే దేశానికి ఏవిధమైన లాభం? ఆ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఏవిధమైన ప్రయోజనం కలుగుతుంది? అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి, ప్రైవేటీకరణ చేస్తే దానివల్ల వచ్చే నష్టాలు, పర్యావసానాలు ఏంటనేది సీఎం కేసీఆర్ వివరంగా చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తే, ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు ఏవిధంగా మాయమైతాయి? తద్వారా లక్షలాది మంది దళిత, గిరిజన, బలహీనవర్గాల పిల్లలకు అన్యాయం ఎలా జరుగుతుందో ముఖ్యమంత్రి చాలాసార్లు స్పష్టంగా చెప్పారు. ‘ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థలకు పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు. విద్యుత్రంగంలో బీహెచ్ఈఎల్కు నేరుగా ఆర్డర్లు ఇచ్చారు. ప్రైవేటు రంగానికి ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉన్నా.. ప్రభుత్వ సంస్థను ప్రోత్సహించాలని బీహెచ్ఈఎల్కు డైరెక్ట్గా ఆర్డర్లు ఇచ్చారు. రైతు బీమా భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రవేశపెట్టారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నప్పటికీ ఎల్ఐసీకి పెద్ద పీట వేసి.. దాని ద్వారానే రైతు బీమా చేయించిన నాయకుడు కేసీఆర్. నేతన్నకు బీమా అని తీసుకొచ్చినా దాన్ని కూడా ఎల్ఐసీకి అప్పజెప్పిన నాయకుడు కేసీఆర్. ప్రభుత్వరంగ సంస్థల పట్ల నిబద్ధతను మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చెప్పిన నాయకుడు కేసీఆర్. ప్రభుత్వ సంస్థలు బతికి ఉంటేనే ప్రజలకు లాభం జరుగుతుంది. జాతి సంపద పెరుగుతుంది. జాతికి లాభం జరుగుతుంది. అందులో పనిచేసే ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడబడతాయని నమ్మిన నాయకుడు కేసీఆర్. అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.