Minister KTR | సిద్దిపేట : ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అనేక జిల్లా కేంద్రాల్లో సకల వసతులతో ఐటీ టవర్లను నిర్మించి కంపెనీలను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు.. ఐటీ మినిస్టర్ కేటీఆర్తో కలిసి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కలలోనైనా సిద్దిపేటకు ఐటీ హబ్ వస్తుందని అనుకున్నామా..? రాష్ట్రమే రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా..? సిద్దిపేటకు సీఎం కేసీఆర్ బలమైన పునాది వేశారు. తెలంగాణకు ఆయువుపట్టు సిద్దిపేట గడ్డ. ఐటీ టవర్ ప్రారంభంతో సిద్దిపేటలో 1500 మందికి ఉపాధి వచ్చింది. సిద్దిపేటకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. ఐటీ టవర్ ప్రారంభం రోజునే సంస్థలు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం చాలా గొప్ప పరిణామం. ఐటీ హబ్కు మరిన్ని నిధులు మంజూరు చేసి విస్తరిస్తాం. సిద్దిపేటలో టీ హబ్ ఏర్పాటు చేస్తాం. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు కేవలం రూ. 56 వేల కోట్లు మాత్రమే. ఇవాళ రూ. 2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధి అని కేటీఆర్ పేర్కొన్నారు. 3 శాతం గ్రామీణ జనాభా ఉన్న తెలంగాణ దేశంలో 30 శాతం అవార్డులు సాధిస్తున్నాయి. హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని 7.7 శాతానికి పెంచాం. మిషన్ భగీరథకు పునాది పడిన గడ్డ సిద్దిపేట అని కేటీఆర్ తెలిపారు.
3 ఎకరాల సువిశాల స్థలంలో రూ.63 కోట్లతో జీప్లస్ 4 అంతస్థుల్లో ఐటీ టవర్ను నిర్మించారు. ఈ టవర్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ 2020 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. అదేరోజు వివిధ కంపెనీలతో ఒప్పందాలపై ఐటీ శాఖ కార్యదర్శి సంతకాలు చేశారు.
సిద్దిపేట ఐటీ టవర్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. మంగళవారం మెగా జాబ్మేళా నిర్వహించగా, పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. ఓఎస్ఐ డిజిటల్ (244 ఉద్యోగాలు ), ఫిక్సిటీ టెక్నాలజీస్ (100), అమిడాయ్ ఎడ్యుటెక్ (80), జోలాన్ టెక్ (25), విజన్ ఇన్ఫో టెక్ (25), థోరాన్ టెక్నాలజీస్ (25), బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్ (03), ర్యాంక్ ఐటీ సర్వీసెస్ (25), కామ్సీఎక్స్ ఐటీ (25), ఎంఎస్పీఆర్ (25) అమృత సిస్టమ్ (25) ఇన్నోసోల్ (25) ఉద్యోగాలు కల్పించాయి. తొలుత 718 మందిని కంపెనీలు ఎంపిక చేసుకొన్నాయి. ఐటీ టవర్ ప్రారంభించిన మరు నిమిషం నుంచే వీరంతా పనిచేసేలా వసతులు కల్పించారు. జాబ్మేళాలో ఉద్యోగాలు పొందినవారికి టాస్ ద్వారా శిక్షణ అందిస్తారు. సిద్దిపేట ఐటీ టవర్లో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన కంపెనీలకు రెండేండ్లపాటు ఉచితంగా నిర్వహణ, అద్దె, విద్యుత్తు, ఇంటర్నెట్ బిల్లులు భారం లేకుండా చూస్తామని మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.