KTR | రాజన్న సిరిసిల్ల : చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు తీసుకురావాలనే కల్పన కేవలం కేసీఆర్( KCR ) లాంటి నాయకుడితోనే సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ తొమ్మిదేండ్లలో అన్ని రకాల కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు నిరంతరం, నిర్విఘ్నంగా సాగాలంటే కేసీఆర్ లాంటి మనసున్న నాయకుడు ఉంటేనే అమలవుతాయి. పేదలకు లాభం జరుగుతుంది. ఇంకేవరు వచ్చినా ఈ కార్యక్రమాలన్నీ మాయమైపోయే పరిస్థితి ఏర్పడుతది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గండిలచ్చపేట గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, సావిత్రీభాయి పూలే విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ గ్రామంలో తెలంగాణ దళిత బంధు అనే కార్యక్రమం కింద ఇద్దరు సోదరులు కలిసి రూ. 25 లక్షలతో ఏర్పాటు చేసుకున్న పౌల్ట్రీ ఫాం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. పోయినవారం ఎల్లారెడ్డిపేటలో దళితబంధు పథకం కింద రైస్ మిల్లును ప్రారంభించాం. పదిరె గ్రామంలో 9 మంది కలిసి 90 లక్షలతో పెట్రోల్ బంక్ పెట్టుకున్నారని కలెక్టర్ చెప్పారు. దాన్ని కూడా అంబేద్కర్ జయంతి తర్వాత ప్రారంభించుకుంటామని తెలిపారు. గండిలచ్చపేటలో దళిత బంధు కింద 30 కుటుంబాలు వ్యాపారాలు మొదలు పెట్టాయి. ఆర్థికంగా ఎదుగుతున్నందుకు గండిలచ్చపేట దళితులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలపుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
దళిత బంధు లాంటి పథకాలు అమలు కావాలంటే నాయకుడికి గుండె నిండా ధైర్యం ఉండాలన్నారు కేటీఆర్. ఊకదంపుడు ఉపన్యాసాలతో ఐదేండ్లు టైం పాస్ చేసిన సీఎంలు చాలా మంది ఉన్నారని తెలిపారు. కానీ కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో వ్యాపారాలు పెట్టి, లాభాలు పొందుతున్నామని లబ్దిదారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల కుటుంబాలకు లబ్ది జరిగిందని తెలిపారు.
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేసుకున్నాం అని కేటీఆర్ వెల్లడించారు. డంపింగ్ యార్డు, నర్సరీ, ట్రాక్టర్ ట్రాలీ, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి పథకాలు దేశంలోని ఇతర గ్రామాల్లో లేవు. ఈ తీరుగా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఉత్తమ గ్రామపంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఇలాంటి పనులు చేయడం వల్లే అవార్డులు వస్తున్నాయన్నారు. కంటి వెలుగులాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదు. గుడ్డితనం వచ్చే దాకా బతికిన వారు చాలా మంది ఉన్నారు. వయసు పెరిగే కొద్ది కంటి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వంలో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాం. అవసరమైన వారికి కండ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ నేతల కుటుంబాలకు అందడం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రైతుబంధు అమలు చేయలేదు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఇంటికి నీళ్లు, 24 గంటల నాణ్యమైన కరెంట్ వస్తలేదా..? రైతుబంధు, రైతుబీమా వస్తలేదా..? ఆసరా పెన్షన్లు వస్తలేవా.. ఇవన్నీ వాస్తవాలు కాదా..? ఆలోచించామని కోరుతున్నా.. విమర్శ కోసం విమర్శ చేయడం కాదు. నాయకుడికి దమ్ముంటే సంపద సృష్టించి పేదలకు పంచాలనే సంకల్పం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఇదే గండిలచ్చపేటలో 2014కు ముందు ఒక ఎకరం భూమి విలువ ఎంత..? ఇవాళ ఎంత పెరిగింది అనేది ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు.