Minister KTR | కేసీఆర్ అంటేనే సంక్షేమమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. అదే ప్రతిపక్షాల పేరు చెబితే సంక్షోభమే గుర్తొస్తుందని విమర్శించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. పేదవాళ్ల మొహాల్లో చిరునవ్వు.. కండ్లలో సంతోషాన్ని ప్రకటించే ప్రభుత్వం.. కేసీఆర్ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టాలంటే.. చారిత్రక కార్యక్రమాలు చేయాలంటే నాయకులకు తెగువ, తెగింపు ఉండాలని.. అల్లాటప్ప నాయకులతో విప్లవాత్మక పథకాలు రావని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం అనంతరం 76 ఏండ్లలో ఎవరూ పెట్టని విధంగా కేసీఆర్ నాయకత్వంలో దళితబంధు అనే విప్లవాత్మక పథకాన్ని పెట్టుకున్నామని అన్నారు. అందులో భాగంగానే ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1100 మందికి దళిత బంధు అందుతున్నదని తెలిపారు. బాబా సాహెబ్ ఆశయాలను ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లున్నారని అన్నారు. కుల రహిత సమాజం, వివక్ష లేని సమాజం ఉండాలంటే ఆర్థిక అసమానతలు తొలగిపోవాలనే ఆకాంక్షతో సీఎం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలపై ఎంత ప్రేమ ఉందో ఆలోచన చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఎవరో వస్తరు.. ఏదో చేస్తరని మోసపోవద్దని జనాలకు మంత్రి కేటీఆర్ సూచించారు. కొంతమంది వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని.. ఒక్క ఛాన్స్ కాదు.. 11 ఛాన్స్లు .. 55 ఏండ్లు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు మరి రైతులకు పైసలు ఇవ్వాలనే సోయి ఎందుకు లేదు? రైతుకు పెట్టుబడి ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 73 వేల కోట్ల రూపాయలు ఈ ఐదారేండ్లలో 70 లక్షల మంది రైతుల ఖాతాలో పడ్డాయన్నారు. ఇదివరకు ఉన్న వాళ్లు మంచి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చేసిండ్రా అని ప్రశ్నించారు. అదే కేసీఆర్ నాయకత్వంలో మిషన్ భగీరథ కార్యక్రమం కింద 43 వేల కోట్లు ఖర్చు చేసి బ్రహ్మాండంగా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాకముందు ఆనాడు కరెంటు ఎట్లుండె.. ఇప్పుడు ఎట్లయ్యిందనేది ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు.
ఎక్కడికో పోయి గోల్మాల్ అవ్వక్కర్లేదు.. తెలంగాణ రాకముందు మన బతుకేంది? ఇయ్యాలేంది? అనేది ఆలోచన చేసుకోవాలని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ రాకముందు పెన్షన్ ఎంత? ఇవాళ ఎంత? తెలంగాణ రాకముందు 200 వచ్చింది.. ఇప్పుడు 2000 అయ్యింది. ఆనాటికి ఈనాటికి 10 రెట్లు పెంచిన ముఖ్యమంత్రిని మరిచిపోదమా? ఇవాళ ఎవరో వచ్చి ఏదో చేస్తామని అంటే ఆగమైదమా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు కరెంటు ఎట్లుండే.. వరంగల్ ఈస్ట్లో ఒక్కో అపార్ట్మెంట్కు వెళ్తే.. డీజిల్ కంపు ఉండేది. జనరేటర్, ఇన్వర్టర్ లేకపోతే ఫ్యాన్లు తిరిగే పరిస్థితి లేదన్నారు. ‘ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం కరెంటు అయినా ఇచ్చిండ్రా ఆలోచన చేయిండ్రి. రైతులకు ఆరు గంటల కరెంటు అన్నారు.. కానీ ఎన్నడూ మూడు గంటల కరెంటు ఇచ్చిన పాపాన కూడా పోలేదు . అలాంటి వాళ్లను మరోసారి నమ్ముదామా?’ అని ప్రశ్నించారు. .
ఇవాళ ఎవరో వస్తరు.. ఏదో చేస్తారనే ఆలోచన అక్కర్లేదని.. కచ్చితంగా తొందరలోనే మీరంతా శుభవార్త వింటారని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేస్తున్నారని తెలిపారు. పెన్షన్లు ఎంత పెంచాలి? ఆడబిడ్డలకు ఎలా సాయం చేయాలి? ఎవరెవరికి ఏమేమీ చేయాలి? ఈ పదేండ్లలో చేసినదానికి ఇంకా ఎక్కువ ఎలా చేయాలనే ఆలోచనలో ఉన్నారని అన్నారు. తొందరలోనే మీకు ఆ శుభవార్త కూడా వస్తదని అన్నారు. ఇప్పటిదాకా ఇచ్చింది కేసీఆరే.. రేపు భరోసాగా ఇచ్చేది కూడా కేసీఆరే. ఎందుకంటే మళ్లీ వచ్చేది.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అని ధీమా వ్యక్తం చేశారు.