హైదరాబాద్: ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తే అబ్బురమనిపిస్తున్నదని చెప్పారు. ఎస్టీ ఆంత్రప్రెన్యూర్స్కి ఎంత సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సీఎం ట్రైబల్ ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (CMSTEI) పథకం లబ్ధిదారులకు మున్సిపల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇస్తామన్నారు. హైదరాబాద్లోని బంజారా భవన్లో 24 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో అన్ని కులమతాల మధ్య గీతలను కరోనా చెరిపివేసిందన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితే కులవ్యత్యాసాలు రూపుమాసిపోతాయన్నారు.
ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనేవి దేశాభివృద్ధికి మూడు సూత్రాలని చెప్పారు. ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలకు భారతీయులు సీఈవోలుగా ఉన్నారని, కానీ దేశం నుంచి వచ్చిన ఇన్నోవేషన్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ 30 శాతం పంచాయతీ అవార్డులను గెలుచుకున్నదని చెప్పారు. కొత్త పారిశ్రామిక వేత్తలను మరింతమంది యువతను ప్రోత్సహించాలని సూచించారు. ఎస్టీ యువ వ్యాపారవేత్తలను మున్సిపల్ శాఖ ద్వారా ప్రోత్సహిస్తామన్నారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.
గిరిజన యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న కేటీఆర్కు మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ భరోసాతో గిరిజన యువత అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున గిరిజనులకు సేవాలాల్, కొమురంభీం భవనాలును ప్రభుత్వం నిర్మించిందని వెల్లడించారు. ఎస్టీ రిజర్వేషన్లను సీఎం కేసీఆర్ 10 శాతానికి పెంచారని చెప్పారు.