ధర్మపురి: కరెంటు గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. రైతులు ఏ మోటారు వాడుతారో తెల్వని సన్నాసులు కాంగ్రెస్ (Congress) నేతలు అని విమర్శించారు. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ధర్మపురిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇస్తే తాగునీరు ఇవ్వలేదు. కాంగ్రెస్ కొత్తపార్టీ కాదు.. చెత్తపార్టీ. కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధు తీసేస్తారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రైతుబంధు రాకుండా చేశాయి. రైతుబంధు పార్టీ కావాలా.. రాబందుల పార్టీ కావాలా.
రైతుబంధు పడకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. రైతుబంధుపై కాంగ్రెస్ వక్రబుద్ధి బయటపడింది. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు. ధరణిని రద్దుచేసి పట్వారీ వ్యవస్థ మళ్లీ తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఓటు వేసే ముందు గ్యాస్ సిలిండర్కు మొక్కాలని 2014లో మోదీ అన్నారు. గెలిన తర్వాత రూ.400గా సిలిండర్ ధరను రూ.1200కు పెంచారు. కేసీఆర్ను మళ్లీ గెలిపిస్తే రూ.400కే సిలిండర్ ఇస్తాం.’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.