హైదరాబాద్: సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కాంగ్రెస్లో (Congress) ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి (Janareddy) కూడా సీఎం అభ్యర్ధేనని విమర్శించారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందో ప్రజలకు తెలుసన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు అని విమర్శించారు. ఆ పార్టీకి ఓటేసి తప్పు చేశామని కర్ణాటక (Karnataka) రైతులు బాధపడుతున్నారని చెప్పారు. కన్నడ రైతులు మన రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్ పాపాలను చెబుతున్నారని వెల్లడించారు. కరెంటు ఇవ్వనందుకు నిరసనగా రైతులు మొసళ్లు తెచ్చి సబ్స్టేషన్లలో వదులుతున్నారని తెలిపారు.
కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ చెప్పారని, మన రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంటు ఉస్తున్నామని వెల్లడించారు. డీకే మాటలు విని మన రైతులు ముక్కున వేలేసుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కర్ణాటకలో రియల్ ఎస్టేట్ రంగం ఆగమాగం అయిందన్నారు. బెంగళూరులో చదరపు అడుగుకు రూ.500 ఎక్కువ వసూలు చేస్తున్నారని విమర్శించారు. అదే తెలంగాణలో టీఎస్ బీపాస్తో లంచాలు లేకుండా భవన నిర్మాణ అనుమతులు వస్తున్నాయని చెప్పారు.
హైదరాబాద్ అభివృద్ధిని చూసి సినీ నటులు రజనీకాంత్, సన్ని డియోల్ ఆశ్చర్యపోయారని చెప్పారు. నగరం నలువైపులా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గడ్డి అన్నారంలో వెయ్యి పడకల టిమ్స్ సిద్ధమవుతున్నదని, నిమ్స్లో మరో రెండువేల బెడ్స్తో కొత్త బ్లాక్ నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతానికి ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు. మలక్పేట ఐటీ టవర్ పూర్తయితే 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
ఎల్బీనగర్ 2014కు ముందు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందని కార్యకర్తలను అడిగారు. ఎల్బీనగర్ ఎంత అభివృద్ధి చెందిందో ఇంటింటికి తిరిగి ప్రజలకు గుర్తుచేయాలని సూచించారు. గతంలో ట్రాఫిక్ అవస్థలు, మంచినీటి సమస్యలు, మురుగునీటి వాసన ఉండేవని, ఇప్పుడు అలాంటివేవీ ఇక్కడ లేవన్నారు. మెట్రో రైలును పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ వరకు, ఎల్బీనగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు విస్తరిస్తామని చెప్పారు. పనామా చౌరస్తాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కికి ఎల్బీనగర్ గురించి ఏం తెలుసన్నారు. కాంగ్రెస్ వాళ్లు సీట్లు పంచుకునే సరికి మనం స్వీట్లు పంచుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే రాజీనామా చేస్తానన్న నాయకుడు సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్లో బీజేపీ కార్పొరేటర్లను గెలిపిస్తే పైసా పని చేయలేదని విమర్శించారు. బూత్స్థాయి కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి చెప్పాలని సూచించారు. ఎల్బీనగర్ ఎంత అభివృద్ధి చెందిందో గుర్తుచేయాలన్నారు. సీఎం కేసీఆర్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలన్నారు. అన్నపూర్ణ పథకం ద్వారా రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తామని, కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా అన్నారు. రూ.400లకే వంటగ్యాస్ సిలిండర్ వంటి పథకాలను గురించి వివరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
Live: ఎల్బీ నగర్ నియోజకవర్గ బూత్ కమిటీల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRBRS #KCROnceAgain #VoteForCar https://t.co/OdM76Kq5tH
— BRS Party (@BRSparty) October 29, 2023