హైదరాబాద్ : అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ( యూఎస్టీడీఏ ) డిప్యూటీ డైరెక్టర్, ప్రధాన నిర్వహణ అధికారిగా నియామకమైన ప్రవాస భారతీయుడు వినయ్ తుమ్మలపల్లికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వినయ్ తుమ్మలపల్లిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్టీడీఏ డిప్యూటీ డైరెక్టర్గా నియమిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. సెనేట్ పూర్తి స్థాయి డైరెక్టర్ను నియమించే వరకు వినయ్ తాత్కాలిక డైరెక్టర్గా కొనసాగనున్నారు. విదేశాలతో అమెరికా వాణిజ్య అభివృద్దిలో యూఎస్టీడీఏ కీలక పాత్ర పోషిస్తోంది.
హైదరాబాద్కు చెందిన వినయ్ 1974లో అమెరికా వెళ్లి అక్కడే సెటిలయ్యారు. వినయ్ తండ్రి టీ ధర్మారెడ్డి ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్సెస్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా సేవలందించారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసేటప్పుడు వినయ్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రూమ్మేట్గా ఉన్నారు. ఒబామా తన హయాంలో వినయ్ను సెంట్రల్ అమెరికా దేశమైన బెలిజికి అమెరికా రాయబారిగా నియమించారు. ప్రైవేటు రంగంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న వినయ్ వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. అమెరికాలోని కొలరాడోలో ఆయనకు రికార్డబుల్ సీడీ-ఆర్, డీవీడీ-ఆర్ ఆప్టికల్ డిస్కుల తయారీ యూనిట్ కూడా ఉంది.