KTR | రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట జలాశయాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పదిహేను రోజుల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాల్లో మెరుగైన వసతులు కల్పించాలని, అందుకు టీటీడీ ఆర్థిక సహకారం అందించాలని సీఎం జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలను అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు. ఫలితంగా ఇప్పుడు సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎల్లారెడ్డిపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. గుడులు, బడులను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ను అభివృద్ధి చేసిన మాదిరే ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ స్కూల్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మనబడి కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
మండు వేసవిలోనూ తెలంగాణలోని చెరువులు, కుంటలు, నదులు, కాల్వలు జలకళను సంతరించుకున్నాయని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ సస్యశ్యామలం అయిందన్నారు. హెలికాప్టర్లో వస్తున్నప్పుడు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, గౌరవెల్లి ప్రాజెక్ట్, మధ్య మానేరు జలాశయాలు నిండు కుండను తలపించాయని పేర్కొన్నారు. ఒకప్పుడు కొనసీమలో సినిమాలు తీసేవారు.. ఇప్పుడు తెలంగాణలోనూ సినిమా తీసేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.
తెలుగు ప్రాంతాలు భూభాగాలుగా విడిపోయినప్పటికీ అన్నదమ్ములుగా కలిసి ఉండాలన్నది, అభివృద్ధి సాధించాలన్నది మా విధానం అని కేటీఆర్ స్పష్టం చేశారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలతో పాటు బ్రాహ్మణ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నామని తేల్చిచెప్పారు. అణగారిన వర్గాలనే కాదు అగ్రవర్ణ పేదలను కూడ ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.