హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు (Farmers) ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు (Minister KTR) తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
ఇటీవల కురిసిన ఆకాల వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని చెప్పారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, వారికి అండగా సీఎం కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. రానున్న ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికార యంత్రంగానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
మంగళవారం సాయంత్రం నుంచి కురుస్తున్న అకాల వర్షాలపై మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్తోపాటు జిల్లా ఎస్పీ, వ్యవసాయ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలోని పరిస్థితులపై వివరాలు తీసుకున్నారు. అనుకోకుండా కురిసిన ఈ అకాల వర్షాల వలన నష్టపోయిన జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు అందోళన చెందవద్దని కోరారు. జిల్లా అధికారులతోపాటు జెడ్పీడీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రతి ఒక్కరు తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అండగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు.