హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్వాళ్ల పనే తెలంగాణను దోచుకోవడమని, ఆ పార్టీకి ఓటేసి అడుక్కు తిందామా? లేదా మన పాలనలో మన రాష్ట్రంలో సగౌరవంగా బతుకుదామా? ఆలోచించుకోవాలని ఓ నెటిజన్ ప్రజలను కోరారు. ‘ఉదర్ కా మాల్ ఇదర్.. ఇదర్ కా మాల్ ఉదర్.. తెలంగాణలో గెలిచేందుకు కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడి నుంచి కంపెనీలను బెంగళూరుకు తరలించేందుకు కుట్ర పన్నుతున్నది’ అని నెటిజన్లు మండిపడ్డారు. హైదరాబాద్లో ఏర్పాటుకు ఇప్పటికే భూమిపూజ పూర్తి చేసుకొన్న ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించాలని ఆ కంపెనీకి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖరాయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ దుర్నీతిని ఎండగడుతూ విమర్శనాస్ర్తాలు సంధించారు. తెలంగాణలో గెలిస్తే కరెంట్, డబ్బు, అంతా కర్ణాటకకు షిఫ్ట్ చేసే కుట్రతో కాంగ్రెస్ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నదని అన్నారు. ఏపీలో కూడా కంపెనీలు పెడితే సహకరిస్తామని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అంటుంటే.. ఇక్కడి కంపెనీలను బీజేపీ గెలిస్తే గుజరాత్కు.. కాంగ్రెస్ గెలిస్తే బెంగళూరుకు తరలించుకుపోయేందుకు జాతీయపార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్పై కర్ణాటక కాంగ్రెస్ భారీ కుట్ర చేస్తున్నదని అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తమై కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ నెటిజన్ పిలుపునిచ్చారు. ‘తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది. అప్పుడు ఫాక్స్కాన్ బెంగళూరుకు వచ్చేసినా వారు ఏమనరు అని డీకే అంటున్నారు. ఎంత నమ్మకం! తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బపడుతున్నా ఇక్కడి కాంగ్రెస్ నాయకులు నోరు మెదపరని డీకేకు ఎంత నమ్మకం!! రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్ పార్టీది ఎంతైనా 60 ఏండ్ల అనుభవం కదా..’ అని ఓ ట్విట్టర్ యూజర్ చురకలంటించారు.