Minister KTR | నరేంద్ర మోదీ ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సెటైర్లు వేశారు. తొర్రూరు సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేసేవారెవరైనా చెప్పమంటే రెండు గంటలు చెప్పేదమ్ముంది మాకు. ఏ ఊరికి వెళ్లినా ఏం చేశామో చూపెట్టేందుకు సాక్ష్యాలు ఉన్నయ్. కండ్ల ముందర కనిపించే సౌలత్లు ఉన్నయ్. మనతో పాటే కేంద్రంలో అక్కడో ప్రభుత్వం వచ్చింది నరేంద్ర మోదీ నాయకత్వంలో.. ఇవాళ తెలంగాణ ఏ మున్సిపాలిటీలో ఏం చేశామ్.. ఏ ఊళ్లో ఏం చేశామ్.. ఏ కులానికి, ఏ మతానికి, విద్యార్థులకు, రైతులకు ఏం చేశామ్.. చెప్పమంటే చెప్పే సత్తా మాకుంది.
మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధాని, ఆయన పార్టీకి, నేతలకు సత్తా ఉండాలి కదా? తెలంగాణ ఆడబిడ్డలకు ఏం చేశారు? తెలంగాణ గిరిజనులకు ఏం చేశారు? తెలంగాణ రైతులకు ఏం చేశారు? తెలంగాణలోని ఏ వర్గానికి ఏం చేశారో చెప్పే సత్తా వారికి ఉన్నదా? వరంగల్కు వచ్చిన సమయంలో ప్రధాని అందరు జన్ధన్ ఖాతాలు తెరిస్తే ధనాధన్ రూ.15లక్షలు వేస్తామని చెప్పారని, మరి అందరికి రూ.15లక్షలు వచ్చాయా? మరి కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు వచ్చిందా? నాకు ఓటేస్తే ప్రధాని అయ్యాక ఐదారేళ్లలోనే రైతుల ఆదాయం డబుల్ చేస్తా? అన్నడు.. మరి రైతుల ఆదాయం డబుల్ అయ్యిందా? నిన్నగాక మొన్న ఓ టమాట రైతు దిగుబడి అమ్మితే అంతాపోంగా రూ.2 లాభం వచ్చింది’ అని తెలిపారు.
‘స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తెచ్చి పేదలకు పంచుతానని మోదీ చెప్పారని, మరి పంచాడా? రూ.15లక్షలు ఎవరి ఖాతాలో పడ్డయ్ ? ‘ఈ పైసలన్నీ ఆయన దోస్తు ఖాతాలో వేసిండు. అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్.. వన్ ట్యాక్ అన్నడు.. ఇప్పుడు కొత్తగా వన్ నేషన్ వన్ ఫ్రెండ్ తీసుకువచ్చిండు. మొత్తం దోస్తుకు దోచిపెడుతున్నడు. శ్రీలంకకుపోయి పైరవీలు చేసి వాళ్ల దోస్తుకు ప్రాజెక్టు ఇవ్వాలని చెప్పి.. గవర్నమెంట్ అని నమ్మబలికి అదానీకి రూ.6వేలకోట్లు ఇచ్చుడు.. అందులో నుంచి బీజేపీలోకి తెచ్చుకునుడు.
ఆ దొంగ సొమ్ముతోని బీజేపీ ఎమ్మెల్యేలు కొనుడు, ప్రభుత్వాలను కూల్చడం, పార్టీలను చీలుస్తున్నది. ఇదీ మోదీ నీతి. ఏం చేశావయ్యా మోదీ ఎనిమిదేళ్లలో అంటే.. చెప్పేందుకు ఏం లేదు. ఆకాశంలో అప్పులున్నయ్. మోదీ వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండే, ఇవాళ్ల రూ.1200కు చేరింది. ఆయన దేశంలో ఉన్నవారంతా పిచ్చొళ్లు అనుకుంటున్నడు. రూ.400 సిలిండర్ను రూ.1200 చేసినా నాకు కర్రుకాల్చి వాత పెడుతలేరు.. రూ.400 నుంచి రూ.4వేలు చేసినా నన్ను ఏం చేయలేరు.. వీళ్లతోని ఏం కాదు అని అనుకుంటున్నరు’ అని విమర్శించారు.
‘ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడుతామని చెప్పి.. గుజరాత్కు తీసుకుపోయిండు. గుజరాత్లో రూ.20వేలకోట్లతో కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నడు. బయ్యారం ఉక్కు కర్మాగారం పెడుతామని చెప్పి మాట ఇచ్చి పెట్టారా? ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ పెడుతామని పెట్టిండా? ఆలోచన చేయాలి. కేవలం హిందూ, ముస్లింల పంచాయితీలు పెట్టిండు. మతపరమైన మంటలు పెట్టి పనికిరాని పంచాయితీలు పెట్టి, మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం తప్ప చేసిన ఒక్క పని లేదు. సిలిండర్ ధర పెంచినోడు.
రూ.70 పెట్రోల్ను రూ.110 చేసి పప్పు, ఉప్పు, నూనె, నెయ్యి అన్నింటిని పిరం చేసిండు. మోదీ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధానమంత్రి. ఇవాళ ఏదీ ముట్టుకున్నా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది అంటే కేవలం దుర్మార్గమైన కేంద్రం, ప్రధాని వల్ల. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా పుట్టిన బిడ్డ నుంచి ముదుసలి వరకు అందరికీ ఏదో ఒక కార్యక్రమం ప్రభుత్వం అమలు చేస్తున్నది. గతంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు సినిమాల్లో పాటలు రాసుకున్నరు. ఇవాళ నేను సర్కారు దవాఖానకే పోతా.. అక్కడ ప్రసూతి అయితేనే మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తది అనే పరిస్థితి వచ్చింది’ అన్నారు.
‘అంగన్వాడీకి వెళ్తే ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం, పెరిగి పాఠశాలకు వెళ్తే సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, హాస్టల్కు వెళ్తానంటే భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా వెయ్యి గురుకుల పాఠశాలల్లో 6లక్షల మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నాం. ఇంటర్, డిగ్రీ చదువుకుంటానంటే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తున్నాం. ఇప్పటికే రూ.18వేలకోట్లు తెలంగాణ ప్రభుత్వం అందించింది. విదేశాల్లోకి వెళ్తానంటే విదేశీ విద్య కోసం ఇప్పటికీ 7వేల మంది విద్యార్థులకు సహాయం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి గ్రామంలో.. ప్రతి కులవృత్తికి ఏదో ఒక లాభం జరిగింది.
తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన, పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్. దళితుల కోసం దళితబంధు కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. దేశ స్వాతంత్య్రం తర్వాత ఎవరూ తీసుకోని సాహసోపేత కార్యక్రమాన్ని తీసుకువచ్చిన నేత కేసీఆర్ కాదా? ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అద్భుతంగా శాశ్వతంగా ప్రజల మనసుల్లో నిలిచేలా పరిపాలన అందిస్తున్న నాయకుడు కేసీఆర్ను కాపాడుకుందాం. రాబోయే ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్రావుకు సిరిసిల్ల కంటే ఎక్కువ మెజారిటీ తీసుకు రావాలని సవాల్ విసురుతున్నా’నన్నారు కేటీఆర్.