హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యుత్తు రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందనడానికి లెక్కలే సమాధానం చెప్తాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంపై దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక వ్యూహాలను అనుసరించడంతోనే విజయాలు సాధ్యమయ్యాయని సోమవారం ట్వీట్ చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు ఉండగా, అది నేడు 18,567 మెగావాట్లకు చేరిందని వెల్లడించారు. 2,136 యూనిట్ల సగటు విద్యుత్తు వినియోగంతో ఎంతోముందు నిలిచామని, జాతీయ సగటు 69 శాతం తగ్గిందని చెప్పారు. తెలంగాణ ప్రగతికి, ఉజ్వల భవిష్యత్తుకు, నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా ద్వారా రైతులకు సాధికారిత చేకూరిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి కొన్ని గంటలే కరెంటు సరఫరాతోపాటు లోవోల్టేజీతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయేవారని గుర్తుచేశారు. నేడు 27 లక్షల మోటర్లకు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, తద్వారా మోటర్లు కాలిపోయే బాధలు తప్పాయని తెలిపారు. దేశంలో వ్యవసాయానికి తెలంగాణ మాత్రమే నాణ్యమైన, నిరంతర ఉచిత విద్యుత్తును అందిస్తుండటం గర్వకారణంగా ఉన్నదన్నారు.
సీఎం ముందుచూపునకు నిదర్శనం
హైదరాబాద్ పవర్ ఐలాండ్ సీఎం కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం, జాతీయ గ్రిడ్ వైఫల్యాల సమయంలో సైతం నగరంలో విద్యుత్తు అంతరాయం లేకుండా సరఫరా చేశామని తెలిపారు. దేశ మొదటి పవర్ ఐలాండ్ మెట్రో సిటీగా హైదరాబాద్ సగర్వంగా నిలుస్తున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా వ్యవస్థను మెరుగుపర్చామని వెల్లడించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాడు కేవలం 74 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా ఇప్పుడది 5,865 మెగావాట్లకు చేరిందని తెలిపారు. 2021-22లో లక్ష్యాన్ని అధిగమించి 5,654.07 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి చేశామని పేర్కొన్నారు. పచ్చని భవిష్యత్తు కోసం తెలంగాణ నిబద్ధతకు అభినందనలు అని కేటీఆర్ అన్నారు.