హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబెర్, ఇతర పార్ట్ టైం ఉద్యోగాలు చేసే గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వారు సేవలు అందిస్తున్న కంపెనీలతో మాట్లాడి ఉద్యోగులకు ఆరోగ్య బీమా, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలను అందించడంతోపాటు జాబ్ సెక్యూరిటీని కల్పించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన గిగ్ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారి సమస్యలు సావధానంగా విన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 3 లక్షలకు పైగా యువకులు ఈ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు.
ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్న వీరి సంక్షేమాన్ని చూసుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. అధికారంలోకి రాగానే గిగ్ వరర్ల సంక్షేమం కోసం ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు గిగ్ వరర్ల ప్రతినిధులతో కలిపి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ బోర్డులో ఒక లీగల్ సెల్ వ్యవస్థతోపాటు యువకులకు కంపెనీల తరఫున ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులను ఎదురొనేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న డెలివరీకి కొంత సొమ్ము అందుకొంటున్న పద్ధతితోపాటు వీరికి కనీస జీతాలను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బీఆర్ఎస్కు అండగా ఉంటాం: గిగ్ వర్కర్లు
తమ సమస్యలను గిగ్ వర్కర్లు మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. పలు కంపెనీలు తమకు అందించే ఫీజులను ఏమాత్రం పెంచడం లేదని, పైగా ఇన్సెంటివ్లను తీసివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. కంపెనీ ప్రతినిధులతో తాను స్వయంగా మాట్లాడి సానుకూలంగా నిర్ణయం తీసుకొనేలా చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వమే స్వయంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్ బుకింగ్, ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించిన ఒక ప్రత్యేక యాప్ను ఏర్పాటు చేస్తే తమకు ఉపయుక్తంగా ఉంటుందని గిగ్ వర్కర్లు తెలుపగా, ఈ ప్రతిపాదనపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. తమకు బతుకు భరోసా చూపిస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తామని గిగ్ వర్కర్లు ప్రకటించారు.