హైదరాబాద్ : వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ శాసనసభ కమిటీ హాలులో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పనుల, అభివృద్ధి సమీక్షలో ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మిగిలిన పనుల పూర్తికి రూ.40కోట్లు కేటాయించడంతో పాటు మూలవాగుపై రూ.60 కోట్లతో నిర్మిస్తున్న 12 చెక్ డ్యాంలను జూన్ లోగా పూర్తి చేయాలని, మల్కపేట భూ నిర్వాసితుల కుటుంబాలకు పరిహారంపై ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్రావుకు ఆదేశాలిచ్చారు.
మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు నీరందించే కలికోట సూరమ్మ లిఫ్టుల నిర్మాణాలకు రూ.650కోట్ల నిధులతో త్వరలో సీఎం ప్రకటిస్తారన్నారు. గుడి చెరువు బండ్ సంపూర్ణ నిర్మాణానికి రూ.20 కోట్లతో భూసేకరణ, ప్రస్తుత బండ్పై సుందరీకరణ, ఘాట్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. పట్టణంలో రోడ్ విస్తరణకు త్వరగా అనుమతులు తీసుకోవాలని, మూలవాగుపై రెండో బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, కొదురుపాక నుంచి కమాన్ వరకు రూ.35కోట్లతో డబుల్ రోడ్, మామిడిపల్లి, నక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి ఆదేశించారు. మోత్కురావుపేట-చందుర్తి రోడ్, రూ.8.50 కోట్లతో మర్రిమడ్ల-మానాల రోడ్డుకు అటవీ అనుమతులు తీసుకుని టెండర్లు పిలువాలని ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావును ఆదేశించారు.
వేములవాడలో సినారె కళా మండపాన్ని సుమారు రూ.7కోట్లతో, స్టేడియం పనులను రూ.5కోట్లతో పనులు పూర్తి చేయాలన్నారు. వేములవాడ పట్టణంలో అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఆధునిక దోభీఘాట్, జంక్షన్ల సుందరీకరణ బాధ్యతలను మున్సిపల్ శాఖ సీడీఎంఏ సత్యనారాయణకు అప్పగించారు. పట్టణంలో విలీనమైన గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ శ్రీధర్ను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన తండాల జీపీ భవనాలకు రూ.25లక్షలు, మండల భవనాల నిర్మాణాలకు, అన్ని మండలాల్లోని రోడ్ల నిర్మాణానికి, రెన్యువల్స్కు, మెయింటనెన్స్కు అవసరమైన నిధులు మంజూరీ చేస్తామన్నారు.
ముంపు గ్రామాల సమస్యలైన పెండింగులో ఉన్న భూమి, ఇండ్ల నష్ట పరిహారం, రుద్రవరంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి తగుచర్యలు తీసుకోవాలని ఇర్రిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో వాడా వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు, ఎల్లంపల్లి సీఈ సుధాకర్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్ రావు, మున్సిపల్ శాఖ సీడీఎంఏ సత్యనారాయణ, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ మాధవి రాజు, కమిషనర్ శ్యామ్ సుందర రావు పాల్గొన్నారు.