హైదరాబాద్ : సిరిసిల్ల పట్టణంలో నిన్న రాత్రి భారీ వర్షం కురియడంతో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. పట్టణంలో వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద ముంపునకు గురైన ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు. సహాయక చర్యల కోసం హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రంగం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు