KTR | హైదరాబాద్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల.. ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి కేటీఆర్.. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వివిధ శాఖల అధిపతులు, పూర్వ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకనాడు వలసలతో పడావుపడ్డ పాలమూరు జిల్లాను పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పచ్చగా చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా లక్షల మంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేది . కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తామన్నారు.
గోదావరి బేసిన్లో కాళేశ్వరం, కృష్ణా బేసిన్లో పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టిందని కేటీఆర్ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తి అవుతాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులను చూస్తుంటే.. కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారతదేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉందన్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు ఇది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
పాలమూరు ఎత్తిపోతల అనేక అడ్డంకులను దాటుకుని కేసీఆర్ పట్టుదలతో పూర్తయిన ప్రాజెక్టు ఇది అని మంత్రి తెలిపారు. రైతుల పొలాలకు సాగునీటితో పాటు, రాజధాని ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఇంత గొప్ప సందర్భాన్ని గొప్పగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలని సూచించారు. కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవం సభ ఉంటుందని కేటీఆర్ తెలిపారు.