హైదరాబాద్/వేములవాడ టౌన్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట తరహాలోనే దేశంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరంగల్ మాదిరిగా వేములవాడ గుడి చెరువు బండ్ను అభివృద్ధి చేస్తామని, సిరిసిల్ల, వేములవాడ పట్టణాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
మహాశివరాత్రి వేడుకలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వేములవాడ రాజన్న క్షేత్రం లో సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి పనులు, శివరాత్రి ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే రమేశ్బాబుతో కలిసి మంగళవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రాజన్న క్షేత్రానికి తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా వేములవాడ పట్టణమంతా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముందు జాగ్రత్తగా అదనపు అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వేములవాడ జాతర ఏర్పాట్ల కోసం అదనపు నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏటా శివరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఈసారి కూడా ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టపై అతి ఎత్తైన శివుని విగ్రహం, కాటేజీల నిర్మాణంతోపాటు అడ్వెంచర్ గేమ్స్, వేములవాడ శివారులోని నాంపల్లి గుట్టపై కేబుల్ కార్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే పట్టణంలోని అన్ని ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఫుట్పాత్లను నిర్మించాలని అధికారులకు సూచించారు. మూలవాగుకు ఆనుకొని ఉన్న బండ్ను సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్గా మారుస్తామని చెప్పారు. చెక్డ్యాంల నిర్మాణం వల్ల నీటి నిర్వహణతో పాటు వాటి పరిసర ప్రాంతాలను అందమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు.
రాజన్న ఆలయానికి అనుసంధానంగా ఉన్న సంస్కృత పాఠశాలకు అనుబంధంగా నృత్య, సంగీత పాఠశాలలను ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకంగా భవనాలను నిర్మిస్తామని వివరించారు. వేములవాడ యువత కోసం అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. కొదురుపాక నుంచి వేములవాడ వరకు నాలుగు లేన్ల రహదారి, నాంపల్లి గుట్టపై రెండో ఘాట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వేములవాడలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమీక్షలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, వేములవాడ ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.