వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఒక ఎమ్మెల్యేను ఎన్నుకొనే ఎన్నికలు కావు. రాష్ర్టాన్ని నడిపించే సరైన నాయకుడిని ఎన్నుకొనే ఎన్నికలు. మా సీఎం కేసీఆర్. మళ్లీ మా సీఎం కేసీఆరే. సీఎంపై మా పార్టీకి స్పష్టత ఉన్నది. కాంగ్రెస్కు, బీజేపీకి సీఎం అభ్యర్థిపై స్పష్టత ఉన్నదా? తెలంగాణను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోగల, కేసీఆర్తో సరిపోల్చగల నేత ఒక్కరైనా ఆ పార్టీల్లో ఉన్నారా?
– మంత్రి కేటీఆర్
Minister KTR | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపడుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో రెండోసారి అధికారాన్ని చేపట్టినట్టే, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లతో అధికారాన్ని చేపడతామని తేల్చి చెప్పారు. శుక్రవారం ప్రగతి భవన్లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల కోసం ఏమేం చేశామో చెప్పి, మళ్లీ అధికారం ఇస్తే ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడుగుతామని అన్నారు. రాజకీయాల్లో తమను గెలిపించేది ప్రజలే కానీ, అధికారులు, అధికారాలు కావని స్పష్టం చేశారు. ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా అందుకు తగిన వ్యూహ, ప్రతివ్యూహాలు అమలు చేస్తామని వెల్లడించారు. తమను నేరుగా ఎదుర్కోలేక, తమ గుర్తును పోలిన గుర్తులు, తమ అభ్యర్థుల పేరును పోలిన పేర్లు పెట్టి ప్రజలను అయోమయానికి గురిచేయాలన్న రాజకీయ భావదారిద్య్రంతో కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ట్రక్, రోడ్డురోలర్ సహా కొన్ని గుర్తుల వల్ల తమకు గతంలో నష్టం జరిగిందని, ఎన్నికల కమిషన్ కారు గుర్తును పోలిన గుర్తులను తొలగిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
‘ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు కాంగ్రెస్ నేతలపై ఎందుకు కావడం లేదు? బీఆర్ఎస్ నేతలపైనే ఎందుకు జరుగుతున్నాయి? పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి వసూళ్లు, దందాలు, భూదందాలు తెలియదా? జూబ్లీహిల్స్లో ఆయన ఇంటిచుట్టూ ఎన్ని కబ్జాలు, సొసైటీలో ఎన్ని కుంభకోణాలు చేస్తున్నాడో మోదీ, అమిత్షా సహా విచారణ సంస్థలకు తెలియదా? రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసును ఎందుకు విచారణకు స్వీకరించలేదు? కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అనేక ఆధారాలున్నా విచారణ జరిగిందా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతీకార దాడులతో పాలన సాగించాలన్నది బీఆర్ఎస్ లక్షణం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా కొన్ని యూట్యూబ్ చానళ్లు కేసీఆర్ను నోటికొచ్చిన బూతులు తిడుతున్నా సంయమనంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు.
హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా మతఘర్షణలు జరిగాయా తెలంగాణలో మసీదుల మీద, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయా? బుల్డోజర్లు వచ్చి ఎక్కడైనా మైనారిటీల ఇండ్లు కూలుస్తున్నాయా? తొమ్మిదిన్నరేండ్లపాటు లౌకికవాదాన్ని పరిరక్షిస్తూ మనిషిని మనిషిగా చూస్తూ పాలన సాగిస్తున్న ప్రభుత్వంపై మచ్చతేవటానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి సరైన సమాధానం చెప్తాం. మాకు సొంతంగా ఎదగాలని ఉన్నది. మహారాష్ట్రలో పాగా వేయాలని ఉన్నది. బీఆర్ఎస్సే జాతీయ పార్టీగా అవతరిస్తున్నప్పుడు మాకు కాంగ్రెస్, బీజేపీతో కలవాల్సిన ఖర్మ ఏమిటి?
– మంత్రి కేటీఆర్
హుజూరాబాద్లో తామే గెలుస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఎన్నికల్లో ఎవరెక్కడినుంచైనా పోటీచేయొచ్చు. ఈటల రాజేందరే కాదు ఇంకెవరైనా, గజ్వేల్లోనే కాదు.. ఇంకెక్కడి నుంచైనా, ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేయొచ్చు. అందులో మాకున్న అభ్యంతరం ఏమిటి? బహుశా బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడం వల్ల అలా నిర్ణయం తీసుకున్నారో’ అని ఛలోక్తి విసిరారు. ‘రాజేందరన్న ఇంకో 50 సీట్లలో పోటీచేయాలన్నా చేస్తారో ఏమో’ అని అన్నారు. పొన్నాలతోపాటు మరికొంతమంది బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నదని కేటీఆర్ సూచనప్రాయంగా వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు అప్పుడే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం అని ముహూర్తాలు పెట్టుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎవరు మంత్రి? ఏ పోర్ట్ఫోలియో? ఎవరు ముఖ్యమంత్రి? అని పంపకాలు జరిగిపోయాయట అని అన్నారు. ‘కాంగ్రెస్లో ముగ్గురు నాయకుల మధ్య పంపకాలు జరిగాయని చెప్పుకుంటున్నారు. ముగ్గురి మధ్య ఏడాదిన్నర చొప్పున పంపకాలు జరిగాయట. చివరి ఆరు నెలలు టాస్ సీఎం అట. ఈ ముగ్గురు నేతలు ఒక మీడియా అధిపతి సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నారని తెలిసింది’ అని తెలిపారు.
హైదరాబాద్ తన గొప్ప సంస్కృతిని గణేశ్ నిమజ్జనం సాక్షిగా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. గణేశ్ నిమజ్జనం ఉన్నదని మిలాద్-ఉన్-నబీ ర్యాలీని వాయిదా వేసుకున్నారు. ఇంత అద్భుతమైన సంస్కృతిని చాటిచెప్పిన ప్రదేశం దేశంలో మరోటి ఉన్నదా? వెలుగు దివ్వెగా హైదరాబాద్ లౌకికత్వానికి కొత్తదారి చూపిస్తున్నది.
– మంత్రి కేటీఆర్
ముదిరాజ్ సామాజికవర్గం అంటే తమకు అపారగౌరవం ఉన్నదని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్కు రాజ్యసభ సీటు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయాక, ఆ సామాజిక వర్గం నుంచి బండా ప్రకాశ్ను ఎమ్మెల్సీ చేసి మండలి డిప్యూటీ చైర్మన్ను చేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలో ముదిరాజ్లకు 2 వేల సహకార సంఘాలను ఏర్పాటు చేసి, వారి అభ్యున్నతికి తోడ్పడ్డామని వివరించారు. భవిష్యత్తులోనూ వారికి అవకాశం కల్పించేది బీఆర్ఎస్సేనని తేల్చి చెప్పారు.
మేం అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టి వాటిని మ్యానిఫెస్టోగా ప్రకటించుకోవటం ఆ పార్టీ భావదారిద్య్రానికి నిదర్శనం. ఆ పార్టీ కర్ణాటకలో చేసిన వాగ్దానాలను అమలు చేయలేక తలలు పట్టుకుంటున్నది. మూడునెలల్లో కర్ణాటకలో మ్యానిఫెస్టో అమలుచేయక విఫలమైన వారు తెలంగాణలో ఎలా సఫలం అవుతారు?
– మంత్రి కేటీఆర్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భద్రతకు ప్రమాదం ఉన్నట్టయితే రాజకీయాల్లో ఇది దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు భద్రతపై లోకేశ్ చేసిన ట్వీట్పై కేటీఆర్ స్పందించారు. ‘లోకేశ్ ట్వీట్ చూసి బాధ అనిపించింది. చంద్రబాబు భద్రత విషయంలో లోకేశ్ ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలను. లోకేశ్ చెప్పింది వాస్తవమైతే ఈ పరిస్థితి బాధాకరం. నాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నిజానిజాలు తెలియవు. కానీ చంద్రబాబు భద్రతకు ప్రమాదముంటే రాజకీయల్లో ఇది దురదృష్టకరం. రాజకీయాలు వేరైనా ఆయన కుటుంబం బాధను అర్థం చేసుకోగలను. వారికి నా సానుభూతి వ్యక్తం చేస్తున్నా. నిమ్స్ దవాఖానలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షచేసిన సమయంలో ఆయన ఆరోగ్యంపై మేం కూడా చాలా ఆందోళన చెందాం. అప్పుడు రోశయ్య ముఖ్యమంత్రి. ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు నన్ను పక్కకు తీసుకెళ్లి మీరు పిచ్చోళ్లు.. ఢిల్లీలో ఎవరూ పట్టించుకోవటం లేదు. రేపు మీ ఫాదర్ బ్రెయిన్డెడ్ అయిపోతారు. ఆ తర్వాత 3, 4 రోజులకు చచ్చిపోతారు అని బెదిరించారు. నేను వినకపోతే ఒక లేడీ ఆఫీసర్ మా అమ్మను పక్కకు తీస్కపోయి అదే విషయం చెప్పారు’ అని నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.