హైదరాబాద్ : కరోనా కారణంగా వయోవృద్ధులు సహా పలు రకాల వారికి ఇచ్చే రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ సిటిజన్ ప్రయాణికుల ఛార్జీలకు వర్తింపజేసే రాయితీలను మార్చి, 2020 నుంచి రద్దు చేశారు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్స్ అందరూ పూర్తి ఛార్జీలు చెల్లించి రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 4 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ పూర్తి ఛార్జీలు చెల్లించి ప్రయాణించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది.
దీనిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓ వార్తా సంస్థ చేసిన ట్వీట్ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ట్యాగ్ చేశారు. రైల్వే మంత్రి గారూ.. ఇది చాలా దురదృష్టకరమని కేటీఆర్ పేర్కొన్నారు. కోట్లాది మంది సీనియర్ సిటిజన్స్కు మన సహాయ, సహకారాలు అవసరం. వారిని గౌరవించుకోవాలి. సీనియర్ సిటిజన్స్కు రైళ్ల ఛార్జీల్లో రాయితీ కల్పించే అంశంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.