Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే.. క్షణాల్లో ఆదుకునే కేటీఆర్.. మరో బాలికకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు ముందుకొచ్చారు. ఆమె ఆవేదనను విని కేటీఆర్ చలించిపోయారు. ఆమె వివరాలు ఉంటే ఇవ్వండి.. తన వంతు సాయం చేస్తానని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కోరారు.
బీహార్కు చెందిన ప్రియాంషు కుమారి దివ్యాంగురాలు. ఆమె చదవుకునేందుకు తన గ్రామం నుంచి 2 కిలోమీటర్లు వెళ్తుంది. ఎడమ కాలు లేకపోవడంతో.. కుడికాలిని ఆసరా చేసుకుని, స్కూల్కు పరుగెడుతోంది. ఈ సందర్భంగా కుమారి మాట్లాడుతూ.. తనకు కృత్రిమ కాలు అందివ్వాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కానీ స్పందన లేదు. తాను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. తన కలలను వదులుకోవడానికి ఇష్టం లేదు. భవిష్యత్లో తాను డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని కుమారి స్పష్టం చేసింది.
కుమారి ఆవేదనపై కేటీఆర్ స్పందించారు. ఆమె వివరాలు ఉంటే ఇవ్వండి. ఆమె కలలను సాకారం చేసుకునేందుకు.. వ్యక్తిగతంగా తన వంతు సాయం చేస్తానని కేటీఆర్ తెలిపారు.
If someone at @ANI can me the girl’s contact details, will be my pleasure to help (in my personal capacity) the young one achieve her dreams https://t.co/5gBoFAsIv0
— KTR (@KTRTRS) July 1, 2022
పంజాబ్కు చెందిన మూగ, బధిర చెస్ క్రీడాకారిణి మాలికకు మంత్రి కేటీఆర్ ఆరు నెలల క్రితం సాయం అందించిన సంగతి తెలిసిందే. పంజాబ్కు చెందిన మాలిక తన అద్భుతమైన చెస్ నైపుణ్యంతో జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అనేక పతకాలు గెలిచినా ఎలాంటి సాయం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన వైకల్యాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మాలికకు సాయం అందించేందుకు మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. ఆమెను పంజాబ్లోని జలంధర్ నుంచి హైదరాబాద్కు పిలిపించి ఆర్థిక సాయం చేశారు. మాలికకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించారు. దీంతోపాటు లాప్ టాప్ ఇచ్చారు. అనంతరం ఆమెను సన్మానించారు. మూగ చెవిటి భాషా అనువాదకురాలి సహాయంతో మంత్రి కేటీఆర్ మాలికతో మాట్లాడారు. మాలికకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇప్పటికే తన వైకల్యాన్ని జయించి ప్రపంచాన్ని గెలిచావని ప్రసంసించారు.