హైదరాబాద్ : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ నిరసనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పట్టణ ప్రగతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఆ జిల్లా అదనపు కలెక్టర్ను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.
కేవలం మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమే ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. ప్రజల కోణంలోనే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యంతరాలు ఉంటే ముసాయిదాలో మార్పులు చేస్తామని ప్రకటించారు. వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రజలకు అన్ని విషయాలు వివరించాలని సూచించారు. 500 ఎకరాలు ఇండస్ట్రీయల్ జోన్కు పోతోందని ఆందోళన చెందుతున్నారు. భూమి పోతుందని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు పత్రికల్లో చూశానని తెలిపారు. ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టేందుకు లేదని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ చేశామన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రజలకు అనుకూలంగా ఉండాలి.. వ్యతిరేకంగా ఉండొద్దు అని కేటీఆర్ పేర్కొన్నారు.