హైదరాబాద్ : గవర్నర్తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన రాజన్న సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పదవిని అవమానపరిచేలా వ్యవహరిస్తోందంటూ గవర్నర్ ఢిల్లీలో మీడియా ఎదుట చేసిన ఆరోపణలపై విలేకరుల సమావేశంలో స్పందించారు. గవర్నర్ అంటే తమకెంతో గౌరవమని, ఆమెను తామెక్కడా అవమానించలేదని తెలిపారు.
గవర్నర్ వ్యవస్థతో మాకెందుకు పంచాయితీ ఉంటదని ప్రశ్నించారు. కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డువచ్చిందా? అన్న కేటీఆర్.. తమిళిసై బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా పని చేశారని, ఆమె గవర్నర్ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డురాలేదా? అని ప్రశ్నించారు. గవర్నర్ మాట్లాడే ముందే ఆలోచించుకోవాలని సూచించారు. గవర్నర్ ఎందుకు ఊహించుకుంటున్నారన్నారు.
గవర్నర్కి ఎక్కడా అవమానం జరగలేదని.. నిజంగా జరిగితే ఎక్కడ? ఎలా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ విషయంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నామన్నారు. నరసింహన్ గవర్నర్గా పని చేసిన సమయంలో ఎప్పుడూ ప్రభుత్వానికి ఇలాంటి సమస్యలు రాలేదని లేదని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. శాసన తొలి సమావేశాల్లోనే గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంటుందని, సమావేశం ప్రోరోగ్ కాలేదు.. అందుకే గవర్నర్ ప్రసంగం లేదని స్పష్టం చేశారు. గవర్నర్ అవమానంగా తీసుకుంటే మేం చేయగలిగిందేమీ లేదన్నారు.