ఢిల్లీ: రెండు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ఢీల్లీ (Delhi) చేరుకున్నారు. రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేనున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాల్లో అందించాల్సిన సహాయంపై పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. ఇందులో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో (Rajnath Singh) భేటీ అయ్యారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నిర్వహణకు చేపట్టిన ఎస్సార్డీపీలో భాగంగా తలపెట్టిన స్కైవేల నిర్మాణం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు ఇవ్వాల్సిందిగా మంత్రిని కోరనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూముల విషయమై గత కొన్నేండ్లుగా కేంద్రం ఏటూ తేల్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విశయం తెలిసిందే.
దీంతోపాటు.. రసూల్పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు హోంశాఖ పరిధిలోని భూముల అవసరం ఉన్నది. ఇందుకు అవసరమైన సహకారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నది. అదేవిధంగా వరంగల్ వద్ద ఉన్న మామునూరు ఎయిర్పోర్ట్పై కేంద్రం ఎటూ తేల్చకుండా ఊరిస్తున్నది. ఈ అంశంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేదా వీకే సింగ్తో సమావేశమై, స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరే అవకాశం ఉన్నది.
పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి హర్దీప్సింగ్పురీతో సమావేశం కానున్నారు. హైదరాబాద్లో ఉన్న మెట్రో పరిధిని మరింత విస్తరించాలని ఇప్పటికే అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. హర్దీప్సింగ్పురీతో సమావేశం సందర్భంగా ఈ విషయంపై తేల్చాలని కోరే అవకాశం ఉన్నది. వీటితోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలపై ఆయా శాఖల కేంద్రమంత్రులను మంత్రి కేటీఆర్ కలువనున్నట్టు సమాచారం. ఒకవేళ పెండింగ్ అంశాలపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన లేదా హామీ రాకపోతే మోదీ సర్కారు వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సృష్టిస్తున్న ఆటంకాలను ప్రజలకు వివరించి, బీజేపీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది.