Minister KTR | పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్బాటంగా మోదీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2014లో ఏర్పాటు చేసిన సభలో పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుపై అప్పటి యూఏపీ ప్రభుత్వం వివక్షను నిలదీసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదేండ్ల పాలనలో పాలమూరును పట్టించుకోకుండా నిద్రపోయారా అని యూపీఏ ప్రభుత్వాన్ని మోదీ నిలదీశారని.. మహబూబ్నగర్పై బీజేపీ ఉదాసీనత చూపించి ఇప్పుడు మరో పదేండ్లు గడిచిపోయాయని అన్నారు. ఈ సందర్భంగా ఈ పదేండ్లలో పాలమూరు అభివృద్ధికి మీరేం చేశారో చూపించాలని అనుకుంటున్నానని మోదీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. గడిచిన పదేండ్లలో పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏ సాయం చేశారని నిలదీశారు. ఈ పదేండ్లలో మీరు అందించిన సాయం సున్నా అని చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మీ బీజేపీ పార్టీ కూడా అవే నంబర్ సీట్లు గెలుచుకుంటుందని ఎద్దేవా చేశారు.
PM @narendramodi Ji,
Back in 2014, you had questioned the UPA Govt about their indifferent attitude towards Palamuru irrigation projects and asked if they were sleeping for 10 years!
Today, after seeing 10 years of BJP’s apathy towards Mahbubnagar, I want to show the mirror to… pic.twitter.com/IBPrHaIU3m
— KTR (@KTRBRS) October 1, 2023
2014 ఏప్రిల్ 22న ఆయన మాట్లాడిన మాటలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. నాడు మోదీ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో యువకులు వందల సంఖ్యలో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అవి కాంగ్రెస్ పాప ఫలితం. తెలంగాణకు ఇప్పుడేం కావాలి? తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఇక్కడ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? రైతులకు నీళ్లు ఉంటే మట్టిలో బంగారం పండిస్తరు. రాహుల్గాంధీ నిన్న వచ్చాడు. ఎన్నికల్లో గెలిపించండి పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని వాగ్దానం చేశాడు. మరి గత పదేండ్లుగా ఏం చేశావ్? పండుకున్నవా? మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా.. ఎందుకు చేయలేదు? వాళ్లు రైతుల గురించి పట్టించుకోరు. బాధ తెల్వదు. మాకు మద్దతివ్వండి.. నీళ్లు ఇస్తాం. కరెంటు ఇస్తాం’ అని వ్యాఖ్యానించారు. అప్పుడు అంతలా మాట్లాడిన మోదీ.. ప్రధాని అయ్యాక పాలమూరును పట్టించుకోకపోవడంపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ మహబూబ్నగర్ పర్యటన నేపథ్యంలో పోస్టర్లతో నిరసన తెలుపుతున్నారు. ‘తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన నీకు తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు.. బిడ్డను బతికించడం కోసం తల్లిని చంపారు. అంటూ తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా మోదీ చేసిన వ్యాఖ్యలను తేదీలతో సహా పేర్కొన్నారు. మోదీకి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.