పుణె: మహారాష్ట్రలోని పుణెలో నిర్లక్ష్యంగా పోర్షే కారు నడిపి (Pune Porsche Crash) ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ను (Vishal Agarwal) పోలీసులు అరెస్టు చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నమోదైన కేసు ఆధారంగా ప్రముఖ బిల్డర్ అయిన ఆయనను ఔరంగాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవాజామున కొరెగావ్ పార్క్లో 17 ఏండ్ల బాలుడు తన మద్యం మైకంలో పోర్షే కారుతో ఓ బైకును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి విశాల్ అగర్వాల్ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు ఆయనను మంగళవారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో అరెస్టు చేశారు. ప్రమాదం సమయంలో మైనర్ బాలుడు 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి బైక్ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
12వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత నిందిత బాలుడు తన స్నేహితులతో కలిసి స్థానిక పబ్లో పార్టీ చేసుకున్నాడని పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ చెప్పారు. కారు ప్రమాదానికి అతడు మద్యం సేవించి ఉన్నాడని తెలిపారు. మహారాష్ట్రలో 25 ఏండ్లు దాటినవారికే మద్యం సేవించేందుకు అనుమతి ఉందని, చట్టవ్యతిరేకంగా మైనర్కు మద్యం అమ్మిన బార్ యజనమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా, ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ బాలుడికి కోర్టు 14 గంటల్లోనే జువైనల్ కోర్టు బెయిలు మంజూరు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 17 ఏళ్ల మైనర్కు జువెనైల్ కోర్టు బెయిలు మంజూరు చేస్తూ, కొన్ని షరతులను విధించింది. రోడ్డు ప్రమాదాల ప్రభావాలు, వాటికి పరిష్కారాలను తెలియజేస్తూ 300 పదాలతో ఓ వ్యాసాన్ని రాయడం, 15 రోజులపాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయడం, మానసిక పరిస్థితిపై పరీక్ష చేయించుకుని, చికిత్స పొందడం వంటి షరతులను విధించింది. అయితే బాలుడికి బెయిల్ ఇవ్వడంపై పుణె పోలీసులు సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు. నేరం తీవ్రత దృష్ట్యా అతడిని మేజర్గా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరారు. తాము నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదుచేశామని సీపీ అమితేశ్ కుమార్ చెప్పారు.