Cyber Crime | గంభీరావుపేట, మే 20: సైబర్ చీటర్లు రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన నలుగురిని కొత్త తరహాలో మోసం చేశారు. వాట్సాప్ గ్రూపుల్లోని ఫోన్ నంబర్లను హ్యాక్ చేసి, వారి పేరిట గ్రూపుల్లో ఏపీకే ఫేక్ లింకులు షేర్చేశారు. తెలిసిన వారే పంపించారని లింక్ ఓపెన్ చేయగానే వారి ఖాతాల్లోని డబ్బు మాయమైంది. ఇలా నాలుగు రోజుల్లో నలుగురి ఖాతాల్లో రూ. 3.25 లక్షలు స్వాహా చేశారు. సోమవారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన పాల సంఘం అధ్యక్షుడు రాజేందర్రెడ్డి పేరిట సంఘం వాట్సాప్ గ్రూపులో ఏపీకే లింక్ను పంపించారు. ఆయన దీనిని ఓపెన్ చేయగా అతడి ఖాతాలోని రూ. 45,500 మాయమయ్యాయి. అలాగే లింక్ను తెరిచిన దండు నరేశ్ ఖాతా నుంచి రూ.44,900, లింగారెడ్డిగారి రాజశేఖర్రెడ్డి అకౌంట్ నుంచి రూ.50 వేలు, కోటయ్యగారి లత ఖాతా నుంచి రూ.1.85 లక్షలు ఇలా నాలుగు రోజుల్లో రూ.3.25 లక్షలు లూటీ చేశారు.
ఫోన్లకు వచ్చిన మెస్సేజ్ను చూసి యూనియన్ బ్యాంక్ ఖాతాదారులైన వీరు సోమవారం పాస్బుక్కులతో బ్యాంక్ సిబ్బందిని సంప్రదించారు. ఖాతాలను పరిశీలించిన సిబ్బంది నగదు డెబిట్ అయినట్లు నిర్ధారించారు. దీంతో వీరు గంభీరావుపేట ఠాణా ఫోలీసుల సాయంతో సైబర్క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు.