Minister KTR | వరంగల్, జూన్ 17 (నమస్తేతెలంగాణ): పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినం కాబట్టే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో రూ.618 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధ్యక్షతన ఆజంజాహీ మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణను 9 ఏండ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసినం కాబట్టే ఉత్సవాలు జరుపుకొంటున్నామని తేల్చిచెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 24 అంతస్థులతో 2 వేల పడకలతో అత్యాధునిక దవాఖానను నిర్మిస్తున్నామని, వచ్చే ఉగాది నాటికి దీనిని అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. పేదలకు అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వపరిపాలన అవకాశం కల్పించామని, గిరిజనులకు రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచామని గుర్తుచేశారు. గిరిజన కుటుంబాలకు చేయూతనివ్వడం కోసం పోడు భూముల్లో పట్టాలిచ్చి, వ్యవసాయం చేసుకొనేందుకు సహకారం అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ 60 ఏండ్ల పాలనలో ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేదని, తాము రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాద్వారా సురక్షిత తాగునీరు నిరంతరం అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న అవార్డులే నిదర్శనమని స్పష్టంచేశారు. పేదల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు 1,001 గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి, ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలను ఖర్చు చేస్తున్నామని గుర్తుచేశారు.
రాష్ట్రం వ్యవసాయ రంగంలో గణనీయ పురోగతి సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2014లో రాష్ట్రంలో 68 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి మాత్రమే వస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో నేడు వరి ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానానికి చేరుకొంటున్నదని చెప్పారు. సాగులు ప్రతి మజిలీలో ప్రభుత్వం అండగా నిలుస్తుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. 9 ఏండ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ.3 లక్షలు దాటిందని తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటివరకు 12 లక్షల మంది ఆడబిడ్లలకు కల్యాణలక్ష్మి, 13 లక్షల మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేసిందని చెప్పారు.
‘సీఎం కేసీఆర్ మేనమామగా మారి ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేసుకొనే మహిళలకు ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగ బిడ్డ పుడితే రూ.12 వేలు ఇస్తున్నారు. ఐటీ రంగంలో విశేష ప్రగతి సాధించినం. కేంద్రం నుంచి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదు. గత పాలకులు ఆజంజాహీ మిల్లును అమ్మితే.. నేడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వరంగల్లో రూ.1,116 కోట్లతో 24 అంతస్తులతో దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నం. దసరా నాటికి సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభిస్తారు. ఇంతపెద్ద దవాఖాన హైదరాబాద్లో కూడా లేదు. వరంగల్లో రూ.89 కోట్లతో సమీకృత జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకొన్నాం’ అని వివరించారు.
ప్రభుత్వం వచ్చే ఆసరా పెన్షన్తో పేదలకు ఎంతో మేలు జరుగుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘గత ప్రభుత్వాలు పెన్షన్ రూ.200, రూ.500ల ఇస్తే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వింతంతువులు, ఇతరులకు రూ.2 వేలు, దివ్యాంగులకు రూ.3 వేలు ఇస్తున్నది. త్వరలోనే దివ్యాంగులకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వనున్నాం. వరంగల్ ఇన్నర్ రింగ్రోడ్డును నిర్మించి ఇక్కడి ప్రజలకు త్వరలోనే అందిస్తాం. 27 ఎకరాల్లో అధునాతన కలెక్టరేట్ను నిర్మించి ఏడాదిలో ప్రారంభిస్తాం. బస్టాండ్ను 3.5 ఎకరాల్లో నిర్మించేందుకు శంకుస్థాపన చేశాం. మంచీనీళ్ల కోసం రూ.50 కోట్లు కేటాయించాం. ఒక్కరోజే వరంగల్లో రూ. 618 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకొన్నం.
అందుకే తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకొంటున్నం. కేంద్రం ప్రజలకు ఒక్కటైనా పనికివచ్చే పనిచేసిందా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా మోసం చేసింది. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అతీగతీ లేదు. జాగా ఇస్తాం ఎయిర్పోర్టు కట్టాలని కోరినా ఎలాంటి స్పందన లేదు. చేతగాని, అసమర్ధ ప్రధాని ఉండటం వల్లే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. మన దేశానికి ఉన్నది ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.12,00కు పెంచారు. అధికారంలోకి రాగానే జన్ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు జమచేస్తామని మోదీ మాట నిలబెట్టుకోలేదు. నల్ల ధనం తెస్తామని చెప్పి ఇపుడు తెల్లముఖం వేశారు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ప్రజల సంక్షేమం కోసం నిత్యం పనిచేసే నాయకులను ప్రజలు తప్పకుండా ఆదరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. వరంగల్ ప్రజలకు అద్భుత సేవలందిస్తున్న ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్కు, చల్లా ధర్మారెడ్డిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి, సంక్షేమాల్లో తెలంగాణను చాంపియన్గా నిలిపిన కేసీఆర్ కావాలా? ప్రజలను మోసం చేసి మళ్లీ వచ్చి మాయమాటలు చెప్తున్న నాయకులు కావాలా? ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేసే సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదిస్తేనే రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధ్యమని అన్నారు.
సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్విప్ ధాస్యం వినయ్భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మలోత్ కవిత, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్నాయక్, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజు, రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, హస్త కళల సంస్థ చైర్మన్ బొల్లం సంపత్కుమార్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
– మంత్రి కేటీఆర్
భారత్లో తెలంగాణ
అనతికాలంలోనే లీడింగ్ స్టేట్గా ఎదిగింది. అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నది. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో మా దేశ దిగ్గజ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించటం సంతోషంగా ఉన్నది. కంపెనీకి తెలంగాణ ఆతిథ్యం సూపర్.
– భారత్లో దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జో బక్