కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయబద్ధమైన వాటా 575 టీఎంసీలు.. ఒక్క సంతకం చేయడానికి చెయ్యి వస్తలేదా? పాలమూరు జిల్లాను ఆనాడు నాశనం చేసింది బీజేపీ, కాంగ్రెస్సే. మోదీజీ 575 టీఎంసీలు కేటాయిస్తున్నట్టు బహిరంగ సభ సాక్షిగా ప్రకటించు.
-మంత్రి కేటీఆర్
Minister KTR | మహబూబ్నగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణపై ప్రధాని నరేంద్రమోదీ విషం చిమ్ముతూ దిగజారి మాట్లాడుతున్నారని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ‘మహబూబ్నగర్కు పీఎం మోదీ వస్తున్నడంట.. ఓట్ల వేటకు బయలుదేరిన మాయగాడు.. ఆయనను ఒక్కటే అడుగుతున్న.. పాలమూరు జిల్లా ప్రజలపై మీకెందుకింత పగ? పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చి.. పాలమూరు- రంగారెడ్డి పథకానికి ఎందుకు ఇయ్యవు? కష్టపడి సాధించుకున్న తెలంగాణపై ఎందుకు విషం కక్కుతున్నవ్?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 19 అభివృద్ధి పనులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి కేటీఆర్ శుక్రవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ప్రగతి నివేదన సభలో మాట్లాడారు. ‘తల్లిని చంపి బిడ్డను వేరుచేసిండ్రని విషపు మాటలు, నికృష్టపు ఆలోచనలు ఎందుకు? ఎందుకీ దిగజారుడు రాజకీయం? రేపు పాలమూరుకు వస్తున్నవ్.. పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తావా? ప్రజాగ్రహానికి గురైతవా? తేల్చుకో మోదీ’ అని సవాల్ విసిరారు.
నీటి వాటాలు తేల్చాల్సిందే!
‘811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయబద్ధమైన వాటా 575 టీఎంసీలు.. ఒక్క సంతకం చేయడానికి నీకు చెయ్యి వస్తలేదా? వలసపోయిన జిల్లా, వలవల ఏడ్చిన పాలమూరు జిల్లాను ఆనాడు నాశనం చేసింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే. ఇప్పటికైనా పాప పరిహారం చేసుకో.. 575 టీఎంసీలు కేటాయిస్తున్నట్టు బహిరంగ సభ సాక్షిగా ప్రకటించు’ అని ప్రధానిని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏ అంశంపై విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘ఇంకో మాట చెప్తున్న మనం ఎన్ని దరఖాస్తులు పంపినా ప్రధానమంత్రి పట్టించుకోలే.. మా వాల్మీకి సోదరులను ఎస్టీల్లో కలపాలని అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి పంపినం.
అయినా పట్టించుకోలే.. ఓటుతోని తెలంగాణను సాధించుకున్నాం.. రేపు అదే ఓటుతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొందాం.. పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొందాం.. రేపు ఢిల్లీలో మనం లేకుండా ప్రభుత్వమే ఏర్పాటు చేయలేని పరిస్థితిని కల్పిద్దాం.. తెలంగాణ సత్తా చాటుదాం.. కేసీఆర్ నాయకత్వంలో మన జగన్నాథ రథచక్రాల కింద కాంగ్రెస్, బీజేపీని తొక్కుకుంటూ ముందుకు పోదాం’ అని పిలుపునిచ్చారు. గ్యారంటీ లేని పార్టీ వారంటీ ఇస్తుందట అని కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు అధికారమిస్తే ఢిల్లీ నుంచి నెలకో ముఖ్యమంత్రి సీల్ కవర్లో ఊడిపడతాడని, అలాంటివారికి అధికారం అప్పగిద్దామా? అని ప్రజలను ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, వీఎం అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కార్పొరేషన్ చైర్పర్సన్లు రజిని సాయిచంద్, ఆంజనేయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రూ.22 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణం..
సిరిసిల్ల, సిద్దిపేటతో పోటీపడి వనపర్తిని అభివృద్ధి చేస్తానని మంత్రి నిరంజన్రెడ్డి హామీ ఇచ్చారు. వనపర్తిలో ఐటీ టవర్ నిర్మాణానికి జీవో విడుదల చేసిన మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. టవర్ నిర్మాణానికి రూ.22 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. 75 వేల ఎకరాలకు నీళ్లిచ్చిన తర్వాతనే నామినేషన్ వేస్తానని మాటిచ్చి నిలబెట్టుకున్నానని, అందుకే ఉమ్మడి జిల్లాలో ఇవ్వనంత భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించారని అన్నారు. ఇప్పుడు లక్ష 25 వేల ఎకరాలకు సాగునీళ్లు తీసుకొచ్చానని వెల్లడించారు. ప్రభుత్వ సహకారంతో అనేక విద్యాసంస్థలు తీసుకొచ్చానని తెలిపారు.