హైదరాబాద్ : గులాబీ కండువా కప్పుకున్న స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ నాయకత్వంలో స్వామిగౌడ్ వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. ప్రభావశీలమైన నాయకుడు దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్లో చేరడం శుభపరిణామం అని పేర్కొన్నారు. దాసోజు శ్రవణ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అని కేటీఆర్ ప్రశంసించారు. వీరిద్దరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
స్వామిగౌడ్, శ్రవణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో కలిసి పని చేసిన సహచరులం మేం. అక్కడక్కడ ఫంక్షన్లలో, ఇతర కార్యక్రమాల్లో కలుసుకునే వాళ్లం. ఆ సమయంలో పార్టీలను పక్కన పెట్టి ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్లం.. అనుబంధాన్ని పంచుకున్నా.. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నామని గుర్తు చేశారు. మళ్లీ తిరిగి కలిసి పని చేసే గొప్ప అవకాశం కలిగింది. ఉద్యమంలో పని చేసిన ప్రతి బిడ్డ.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు, కార్యక్రమాలను గమనించి వందకు వంద శాతం.. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే శక్తి కేసీఆర్కు మాత్రమే ఉందని అంగీకరిస్తారని అనుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు.