వరంగల్ : పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్టైల్ పరిశ్రమకు భూమిపూజ చేసిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. పత్తి పండించే రైతులు మన వద్ద లక్షల సంఖ్యలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. మన పత్తి అత్యుత్తమ క్వాలిటీ కలిగిన పత్తి అని వస్త్ర వ్యాపార రంగానికి చెందిన పరిశ్రమల పెద్దలు చెప్పారు. తమిళనాడు, గుజరాత్, ఆంధ్రాలో పండిన పత్తి కంటే మన పత్తి బాగుందని చెప్పారు. వేల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించేందుకు ఈ పార్కు ఏర్పాటు చేశామన్నారు. కేరళకు చెందిన ఈ పార్కు వరంగల్కు రావడానికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్, చల్లా ధర్మారెడ్డినే. వేరే ఎమ్మెల్యేలతో కాకపోయేది ఇది.. చల్లా ధర్మారెడ్డి కాబట్టి పట్టుబట్టి సాధించాడని కేటీఆర్ స్పష్టం చేశారు.
స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్కు ఒకాయన ఉద్యోగం ఇస్తానని చెప్తాడు. ఇక తెల్లారి ఆయన పండ్లు తోముతుంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. బాత్రూంలోకి వెళ్లి బయటకు రాగానే.. అక్కడుంటడు. ఏమైంది సార్ నా ఉద్యోగమని అడుగుతడు. టిఫిన్ చేయడానికి పోతే మళ్లీ అక్కడ కనిపిస్తడు. ధర్మారెడ్డి సేమ్ టు సేమ్. ఒక పనిని పట్టుకున్నడంటే దాన్ని సాధించేదాకా వదలడు. మంత్రులందర్నీ పరేషాన్ పరేషాన్ చేస్తడు. పరకాల నియోజకవర్గానికి సంబంధించిన ఏ పనినైనా పట్టువదలని విక్రమార్కుడిలా సాధించే నాయకుడు మీకు ఉండడం అదృష్టమని కేటీఆర్ అన్నారు. పరకాల కోసం, ఇక్కడి ప్రజల కోసం ప్రతి క్షణం పరితపిస్తుంటాడు అని కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.