KTR | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఆవరణలోని చెట్ల వల్ల ఎండాకాలంలో కూడా చల్లగా ఉంది. ఏసీ ఆడిటోరియం కంటే కూడా బాగుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. మన నగరం జీవన ప్రమాణాలలో నివాసయోగ్యంగా ఉంది. ఇంకా నగరం అభివృద్ధి చెందడానికి జరగాల్సిన పని కూడా చాలా ఉంది. సరిగ్గా 9 ఏండ్ల కింద ఏర్పాటైన తెలంగాణలో నగరం, నాయకత్వం, మౌలిక వసతుల గురించి ఎన్నో అపోహాలు, అనుమానాలు ఉండేవి. కానీ ఇవాళ 10వ వసంతలో అడుగుపెడుతున్న సందర్భంగా ఎక్కడ ఏ ర్యాంకింగ్ తీసుకున్నా.. ప్రతి దాంట్లో అగ్రభాగాన నిలుస్తూ దేశానికే దిక్సూచిగా మారింది. సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ నివేదికలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి విడుదల చేసిన తాజా బుక్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే చాలా ముందు వరుసలో ఉన్నాం. ఇది రాష్ట్రానికి గౌరవ కారణం. సాగునీరు, తాగునీరు, అటవీ సంపద, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, పరిశ్రమల్లో తనదైన ముద్ర వేస్తున్నారు కేసీఆర్. ఏ రంగాన్ని కూడా కేసీఆర్ విస్మరించలేదు. అన్ని రంగాల్లో హైదరాబాద్, తెలంగాణ అగ్రభాగానా ఉంటున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ నగరంగా ఉందని పలు నివేదికలు వెల్లడించాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ బాగానే ఉంది. ప్రపంచంతో పోల్చితే విశ్వనగరం కావాలంటే చాలా మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. స్పష్టమైన ఎజెండా, దక్షత గల నాయకత్వం, అన్నింటికి మించి ఇతరులతో కలిసి పని చేసే మనస్తత్వం ఉండాలి. ఒక వ్యక్తి, సంస్థ గానీ సర్వం నాకే తెలుసు. ప్రపంచం మొత్తం నాకే తెలుసు అనుకుంటే ఎక్కడికి పోలేవు అని కేటీఆర్ పేర్కొన్నారు.
మాన్సూన్కు సంబంధించి చాలా పనులను పర్యవేక్షిస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. నాలాలను క్లీనింగ్ చేసేటప్పుడు.. పూడికలో వచ్చే కొన్నింటిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. సోఫాలు, దిండ్లు, ఇతరత్రా వస్తువులు అనేకం బయటపడుతాయి. సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయో లేదో కానీ నాలాలో అన్నీ దొరుకుతాయి. పనికిరాని వస్తువులను నాలాల్లో ఎందుకు వేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకింత అనాగరికంగా ఆలోచిస్తున్నామో అర్థం కాదు. నాగరిక సమాజంలో బతకాలనే వారు ఇలా చేయరు. ఇల్లు మాత్రమే నాది.. నాలా నాది కాదు అనే భావనతో బతకొద్దు అని కేటీఆర్ సూచించారు. మార్పు రానంత వరకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ ప్రయోజనం ఉండదన్నారు.
నగరం బాగుపడాలంటే పౌరుల భాగస్వామ్యం తప్పకుండా అవసరం అని కేటీఆర్ స్పష్టం చేశారు. అందరం కలిసి కదిలితేనే మార్పు వస్తుంది. నాగరికంగా బతికే అవకాశం కలుగుతుంది. అనాగరిక లక్షణాలు సమాజంలో అనేకం ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పది శాతం బడ్జెట్ను పచ్చదానికి కేటాయించారు. చెట్లను నాటి కాపాడాలని కేసీఆర్ ఆదేశించారు. లేదంటే సర్పంచ్, కౌన్సిలర్ ఉద్యోగం పోతుందని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే.
ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ట్రాక్టర్, ట్యాంకర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సదుపాయం ఇతర రాష్ట్రాల్లో లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.