సీఎం కేసీఆర్ పాడిని, పంటను ప్రోత్సహిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 5 విప్లవాలు వెల్లివిరిస్తున్నాయి. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానా వంటి రాష్ర్టాలను వెనక్కినెట్టి తెలంగాణ ముందు నిలిచింది. రాష్ట్రంలో హరిత విప్లవం వచ్చింది. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో భారీగా మత్స్య సంపద పెరిగి నీలి విప్లవం వచ్చింది. పాల ఉత్పత్తి భారీగా పెరిగింది, ఇప్పుడు మెగా డెయిరీతో శ్వేత విప్లవం వస్తుంది. గొర్రెల పంపిణీతో భారీగా మాంసం ఉత్పత్తి పెరిగి పింక్ విప్లవం వచ్చింది. ఆయిల్పామ్ సాగుతో ఎల్లో విప్లవం వచ్చింది.
– మంత్రి కేటీఆర్
Minister KTR | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం వాటిని కాపాడుతూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం, విజయ మెగా డెయిరీ నిర్మాణమే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు. గురువారం రావిర్యాలలో నిర్మించిన విజయ మెగా డెయిరీని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మహేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద డెయిరీని రెండేండ్లలోనే పూర్తి చేయటం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రైతు సంస్కృతిలో పాడి-పంట సమానమని చెప్పారు. కానీ ఉమ్మడి పాలనలో ఈ సంస్కృతిని నాశనం చేశారని, విజయ డెయిరీని నిర్వీర్యం చేసే కుట్ర చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వచ్చాక విజయ డెయిరీ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఒకప్పుడు రోజుకు 1.5 లక్షల లీటర్ల పాలను మాత్రమే సేకరించే విజయ డెయిరీ ఇప్పుడు 4 లక్షల లీటర్లకు పెరిగిందని వివరించారు. మెగా డెయిరీ ప్రారంభంతో ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు.
2022 వరకు దేశంలోని రైతులందరి ఆదాయం డబుల్ చేస్తానని 2014 ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారని, మరి ఆదాయం డబుల్ అయిందా? అని రైతులను కేటీఆర్ ప్రశ్నించారు. కాలేదంటూ రైతులంతా పెద్దఎత్తున నినాదాలు చేశారు. మోదీ చెప్పే ఊకదంపుడు మాటలు, ఉపన్యాసాలతో రైతుల ఆదాయం డబుల్ కాదని అన్నారు. సీఎం కేసీఆర్లా రైతులపై ప్రేమ, వారికి ఏదైనా చేయాలన్న తపన ఉంటేనే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని తెలిపారు. మోదీ రైతు వ్యతిరేక నిర్ణయాలతో దేశ రైతాంగం కష్టాల్లో ఉంటే, సీఎం కేసీఆర్ సంక్షేమ నిర్ణయాలతో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని స్పష్టం చేశారు. రైతులకు ఇప్పటికే రూ.75 వేల కోట్ల రైతుబంధు ఇచ్చామని, ఏటా రూ.10 వేల కోట్లతో ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని, రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నామని, రైతుబీమా ఇస్తున్నామని వివరించారు. పాడి రైతులకు త్వరలోనే లీటరుకు రూ.4 చొప్పున ఇచ్చే పాల ప్రోత్సాహక బకాయిల్ని విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పాడి రైతులకు ఇప్పటికే ప్రోత్సాహకం కింద రూ. 350 కోట్లు ఇచ్చామని, ఇంత భారీ మొత్తంలో ఇచ్చి న ప్రభుత్వం మరే రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ చొరవతోనే విజయ డెయిరీ బతికిందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని సీఎం లాభాల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. ఒకప్పుడు విజయ డెయిరీకి 35 వేల మంది పాడి రైతులే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 1.5 లక్షలకు చేరిందని వివరించారు. పాల సేకరణ 1.37 లక్షల టన్నుల నుంచి 4 లక్షల టన్నులకు పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం తార్నాకలో ఉన్న విజయ ప్లాంట్ సరిపోదనే మెగా డెయిరీ నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, నవీన్, జిల్లా చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, విజయ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్కుమార్, పశు సంవర్ధకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, కలెక్టర్ హరీశ్, తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.