హైదరాబాద్ : బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం.. ధర్మం కోసం అంటారనీ.. పెట్రో ధరల పేరిట చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం.. ధర్మం కోసమేనా? అని ప్రశ్నించారు. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.. అంతర్జాతీయంగా చవక ధరలకు పెట్రో ఉత్పత్తులను కొని అధిక ధరలకు దేశ ప్రజలకు అమ్ముకుంటున్న దళారి ప్రభుత్వం నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అని విమర్శించారు.
బహిరంగంగా తాను చేస్తున్న దోపిడీని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టి చేతులు దులుపుకుంటున్న బట్టేబాజ్ సర్కార్ కేంద్రంలో ఉందని, ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ఇందులోని మర్మాన్ని సవిరంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
2014కు ముందు పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9.48 ఉండేదని, అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం దాన్ని రూ.32.98కి పెంచిందని ఆరోపించారు. గతేడాది కాస్త తగ్గించి దాన్ని రూ.27.90 చేశారని, ఈ ఎక్సైజ్ డ్యూటీలో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వస్తుందంటూ కేంద్రమంత్రులతో పాటు వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సోషల్ మీడియాలో డప్పు కొడుతుందని.. కానీ ఇది పచ్చి అబద్ధమన్నారు. పెట్రోల్ ధరలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దాంట్లో అన్ని రాష్ట్రాలతో పంచుకునేది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమేనన్నారు.
ఇప్పుడున్న పెట్రో ధరలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి 40 పైసలు మాత్రమేనని, ఇందులో నుంచి 41 శాతాన్ని అంటే అక్షరాల 57 పైసల్ని కేంద్రం.. అన్ని రాష్ట్రాలకు పంచుతుందన్నారు. ఇందులో తెలంగాణ వాటా 2.133 శాతమని.. అంటే లీటరుకు 0.01 పైసలు అని తెలిపారు. కానీ, 28 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ ముక్కుపిండి వసూలు చేస్తున్న మోడీ సర్కార్, అందులో నుంచి ఆఠాణా మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు గప్పాలు కొడుతుందన్నారు.
అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మోదీ రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రలు అమలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పెరుగుతున్న పెట్రో ధరలతో కేంద్ర ప్రభుత్వ ఖజానా మాత్రమే నిండేలా చూసుకుంటున్నారు. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల రూపంలో కాకుండా సెస్ల రూపంలో పెట్రోరేట్లు పెరుగుతున్నాయన్నారు. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రూ.18, వ్యవసాయ, మౌలిక వసతులు అభివృద్ధి పేరిట రూ.2.50, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరిట రూ.11.. ఇలా ప్రతి దానికి ఒక్కో పేరు చెప్పి దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా రూ.30పైగా సెస్ల పేరుతో మోడీ సర్కార్ వసూలు చేస్తుందన్నారు. ఇందులో నుంచి రాష్ట్రాలకు దక్కేది గుండు సున్నానేనని.. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి దాదాపు పెట్రో ధరలను రెట్టింపు చేసినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2015 నుంచి ఇప్పటిదాకా వ్యాట్ టాక్స్ ఒక్క నయాపైసా కూడా పెంచలేదన్న సంగతిని ప్రజలంతా గమనించాలని కేటీఆర్ కోరారు.
పెట్రో ధరల పేరిట పట్టపగలు ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు రావాలని, కానీ బీజేపీ అవకాశవాద, అసమర్థ విధానాలను చూసిన తర్వాత తరచూ ఎన్నికలు వస్తే బాగుంటుందని, అట్లయినా పెట్రో ధరల పెంపు ఆగుతుందన్న ఆలోచనల్లోకి ప్రజలు వచ్చారన్నారు.
పెట్రో ధరల పెంపు ఓ రాజకీయ అంశంగా వాడుకుంటున్న బీజేపీ.. ఎన్నికల తర్వాత అత్యంత కర్కశంగా వరుసగా పెట్రో ధరలను పెంచుకుంటూ పోవడాన్ని అలవాటుగా మార్చుకుందన్నారు. 2017 గుజరాత్ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కొన్ని వారాలు, నెలలపాటు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదని, కానీ ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి దాదాపు ప్రతీ రోజూ పెట్రో ధరల్ని మోదీ సర్కార్ పెంచుకుంటూ పోతుందన్నారు. గత పదిహేను రోజుల్లో 13 సార్లు పెట్రోల్ ధరలను పెంచి ప్రజలన్నా, ప్రజల కష్టాలన్నా తనకు ఎంత చులకనభావం ఉందో మోదీ సర్కార్ చాటుకుందన్నారు.
నాలుగు రాష్ట్రాల్లో గెలిపించిన పాపానికి.. ప్రజలకు మోడీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తనకు చేతకాని పాలనను పక్కనపెట్టి కేవలం పెట్రో ధరలను పెంచడాన్నే అలవాటుగా మార్చుకుందంటే అతిశయోక్తి కాదన్నారు. పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయని అడిగిన ప్రతీసారి అదరకుండా, బెదరకుండా అబద్ధాన్ని చెప్పే దొంగ నేర్పు ప్రస్తుత కేంద్ర మోదీ సర్కార్కు పుష్కలంగా ఉందన్నారు.
అందుకే తాజా ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రేయిన్ సంక్షోభాన్ని సాకుగా కేంద్ర మంత్రులు చూపిస్తున్నారన్నారు. లోక్సభలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి రామేశ్వర్ తేలి చేసిన ప్రకటన ప్రకారం.. రష్యా నుంచి కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ క్రూడాయిల్ను మనం దిగుమతి చేసుకుంటున్నామని.. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, అమెరికా నుంచే మనం అత్యధికంగా పెట్రో ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారని గుర్తు చేశారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ఈ దేశాల నుంచి మనకు పెట్రో ఉత్పత్తులు రావడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఒక్కశాతాన్ని చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారన్నారు. ఇలా పదే పదే అబద్దాలను వల్లె వేసీ..వేసీ.. బీజేపీ నాయకుల నోట్లోని నాలుకలు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. మానవత్వం అస్సలు లేని ప్రభుత్వం దేశ ప్రజల నెత్తి మీద తిష్ట వేసుకుని కూర్చుందని, కరోనా సంక్షోభాన్ని అత్యంత్య దారుణంగా మార్చిన మోదీ సర్కార్, ఆ టైంలో పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, వ్యాక్సిన్ల ఖర్చును పెట్రోల్ ధరలతో వసూలు చేసుకుంటామని సిగ్గులేకుండా ప్రకటించిందన్నారు.
ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలపై భారీగా పన్నులు వసూలు చేయడమే అన్న స్ఫూర్తితోనే నరేంద్ర మోదీ సర్కార్ పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని, ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందనిపిస్తుందని సెటైర్ వేశారు. సమర్థ విధానాలు, నిర్ణయాలతో సంపదను సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ.. సృష్టించిన సంపదను ప్రజలకు పంపిణీ చేయాలి కానీ, కేవలం పన్నుల పేరిట ప్రజలను పీల్చిపిప్పి చేయడమే పరిపాలనగా భావిస్తున్న, బీజేపీ ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రజలు సాగనంపే రోజు దగ్గర పడిందన్నారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం ఖాయమన్నారు.
పెట్రో రేట్ల పెరుగుదలతో ప్రతీ ఒక్కరి దైనందిత జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో వాడే గ్యాస్, పప్పు, ఉప్పు, ఔషధాల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయన్నారు. సామాన్యుడి బతుకు దినదిన గండంగా.. బీజేపీ హయాంలో గ్యాస్ బండ.. మోయలేని గుదిబండగా మారిందని ఆరోపించారు. దీంతో మోదీ చెప్పిన పకోడీలు అమ్ముకుని బతికే పరిస్థితి కూడా లేదని, పెట్రో ధరల పెంపుతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలోకి వచ్చిందన్నారు.
ప్రజలు బైకులు, కారులు వదిలేసే పరిస్ధితి నెలకొంటున్నదని, వంట గ్యాస్ వెయ్యి దాటడంతో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కైందన్నారు. వ్యవసాయ పెట్టుబడివ్యయం పెరిగిపోతున్నదని, ఇన్నేళ్ల పాలనలో బీజేపీ సాధించిన ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయా? అంటే అవి పెట్రో వాతలు.. ధరల మోతలేని విమర్శించారు. అధికారంలోకి రావడానికి ముందు పెట్రో ధరల పెంపును రాజకీయాస్త్రంగా మార్చుకున్న నరేంద్ర మోదీ ఆనాటి తన మాటలు, చేతలను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు.
కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు పోయి ఆదాయాలు తగ్గి, నిరుద్యోగిత పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో రేట్ల పెంపుతో ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతున్న విషయాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించాలని కేటీఆర్ అన్నారు. తన అసమర్థ ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలపై వివరణ ఇవ్వాలన్నారు. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.
పెట్రో ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటల్ని ప్రజలు సీరియస్గా పట్టించుకున్న రోజు, ధర్మ సంకటాన్ని వీడి కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజాక్షేత్రంలో తిరస్కారం తప్పదు అన్న సంగతిని గుర్తుంచుకుని వెంటనే పెట్రో, గ్యాస్ ధరల పెంపుని ఆపాలన్నారు. ప్రజలకు ప్రయోజనం కలిగేలా పెట్రో రేట్లను తగ్గించేందుకు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేశ ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతీ రోజూ ప్రజల రక్తం పీల్చేలా పెంచుతున్న పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.