హైదరాబాద్ : సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. పట్టణాలు ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా మారాయి. రాష్ట్ర భూభాగంలో 3 శాతంలోనే 50 శాతం జనాభా ఉన్నారు. రాష్ట్ర జనాభా దాదాపు సగం మంది పట్టణాల్లో ఉన్నారు. పట్టణాల అభివృద్ధిలో భాగంగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం. దాదాపు 2 లక్షల మంది కమిటీల్లో ఉన్నారు. ఇండ్ల నిర్మాణానికి సెల్ఫ్ ఎసెస్మెంట్ విధానం తీసుకొచ్చాం. 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదు.
టీయూ ఎఫ్ఐడీసీ ద్వారా అన్ని పట్టణాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేశాం. సీఆర్ఎంపీ కింద రూ. 1800 కోట్లకు పైగా నిధులతో రోడ్లను నిర్మిస్తున్నాం. ఎస్ఆర్డీపీ కింద లింకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. నాలాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టబోతున్నాం. చెరువుల సుందరీకరణకు ప్రత్యేక కమిషనర్ను నియమించాం. రూ. 37 కోట్లతో ట్యాంక్బండ్ను ఆధునీకరించాం. హుస్సేన్ సాగర్ వెంట నైట్ బజార్ ఏర్పాటు చేయబోతున్నాం. పట్టణాల్లో 54,776 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. నగరాల్లో పచ్చదనం పెంచేందుకు గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేశాం. అర్బన్ పార్కులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. డీఆర్ఎఫ్ బృందాలను భవిష్యత్లో ఇతర కార్పొరేషన్లకు విస్తరిస్తాం అని కేటీఆర్ తెలిపారు.