మహబూబాబాద్ : తెలంగాణ గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) వెంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మున్సిపల్ , ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ( IT Minister KTR ) డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులకు పోడుభూముల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు.
ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్రం అడిగితే గిరిజన యూనివర్శిటీ కోసం 360 ఎకరాల భూమిని ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయినా ఇప్పటి వరకు వర్శిటీని ఎందుకు నెలకొల్పడం లేదని కేంద్రాన్ని కేటీఆర్ నిలదీశారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్టీల్ అథారిటీ ద్వారా పెడుతామని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు అయింది. కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. కాని నేడు మోసం చేస్తున్నారు. రైళ్లను తయారు చేసే కోచ్ బదులు మరమ్మతులు చేసే దుకాణం పెడుతున్నారు. ఇది ఎంతో అన్యాయమని ఆరోపించారు.
ఇచ్చిన మాట తప్పినందుకు తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని, ఇచ్చిన హామీలపై వరంగల్ పర్యటనలో ప్రధాని మోదీ సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో 21వేల కోట్లరూపాయలతో కోచ్ ఫ్యాక్టరీ పెట్టారని ఆరోపించారు. గుజరాత్కు ఒక న్యాయం. తెలంగాణకు ఒక న్యాయమా . ఇది మంచి పద్దతి కాదని కేటీఆర్ అన్నారు. దేశానికి ప్రధాని మంత్రి తప్పా గుజరాత్కు కాదని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావడానికి ఆడే అబద్ధాలను అసలే నమ్మవద్దని కోరారు. 50 సంవత్సరాలు మోసం చేశారు. మళ్లీ మోసం చేయడానికి వస్తున్నరు. ఆగం కావద్దని సూచించారు. అన్ని రకాలుగా పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను భారీ మెజారిటీ మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.